|
|
by Suryaa Desk | Thu, Mar 12, 2026, 06:23 PM
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందరిమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద సొంత స్థలం ఉండి ఇండ్లు నిర్మించుకునే పేదలకు రూ.5 లక్షల సాయం అందిస్తు్న్నారు. మెుత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3500 చొప్పున మెుత్తం 4 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. తాజాగా రెండో విడతపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఏఫ్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేస్తామని చెప్పారు.
తొలి విడత లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి ప్రతి లబ్ధిదారుడుకి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఓ నిరుపేదకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొన్ని సాంకేతిక సమస్యలతో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ బిల్లులు రావడంలేదని సాంకేతిక సమస్యలు పరిష్కరించి అందరికీ బిల్లులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోని డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు ఏప్రిల్ మాసంలో మరికొంత మంది అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల అందజేస్తామని తెలిపారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అంతకు ముందు నంచర్ల గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మండప నిర్మాణంతో పాటు వంటశాల నిర్మాణానికి నెల రోజుల్లో నిధులు మంజూరుకి తన వంతుగా సహకరిస్తానని మంత్రి తెలిపారు. పురాతన ఆలయానికి భక్తులు రావడానికి నంచర్లకు కావలసిన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.