![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:43 PM
ప్రపంచ ఆరోగ్య సంస్థ వేదికగా భారత దౌత్యవేత్త అనుపమ సింగ్, పాకిస్థాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ఒకవైపు పెంచి పోషిస్తూనే, మరోవైపు తామే బాధితులమంటూ మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని ఆమె పాకిస్థాన్కు గట్టిగా హితవు పలికారు. జెనీవాలోని డబ్ల్యూహెచ్వో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో అనుపమ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది. పాకిస్థాన్ భూభాగం నుంచే ఉగ్రవాదులు, వారిని నడిపించే సూత్రధారులు కార్యకలాపాలు సాగిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని అనుపమ సింగ్ అన్నారు. "అటువంటి ఉగ్రవాద శక్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకే భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా దాయాది దేశంలోని ఉగ్రవాద స్థావరాలను, వారి మౌలిక సదుపాయాలను నేలమట్టం చేశాం" అని ఆమె తెలిపారు. అయితే, ఈ చర్యల వల్ల పాకిస్థాన్ పౌరులకు ఎలాంటి హాని కలగలేదని, వారిని లక్ష్యంగా చేసుకోలేదని కూడా ఆమె తేల్చిచెప్పారు. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తే పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయిందని అన్నారు.