![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:40 PM
తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విపరీతమైన ప్రవర్తన, పక్కదారి పట్టిన ప్రాధాన్యతలు, రాజకీయ నిజాయతీ లోపం కారణంగా రాష్ట్రాన్ని నడిపించడానికి అనర్హుడని కేటీఆర్ నేడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆరోపించారు."రేవంత్ రెడ్డి ప్రమాదకరమైన మానసిక స్థితి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారు. అందుకే ఒకే అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్నారు" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 580 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వర్షాలకు వరి ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇలాంటి సమయంలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించాల్సింది పోయి, రేవంత్ రెడ్డి నాలుగుసార్లు మిస్ వరల్డ్ కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణకు ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా?" అని ఆయన ప్రశ్నించారు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతూనే, అందాల పోటీల కోసం ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. "సీపీఐ నేత నారాయణ చెప్పినట్లుగా, మంత్రులు అందాల రాణులకు టూర్ గైడ్లుగా మారారు. ఇది పాలనా లేక ఫ్యాషన్ షోనా?" అని కేటీఆర్ నిలదీశారు.ప్రభుత్వ ప్రాజెక్టులను మిస్ వరల్డ్ పోటీదారులకు చూపించడాన్ని ఆయన ఎగతాళి చేశారు. వాటికి రాజకీయ ప్రాధాన్యత ఏంటని ప్రశ్నించారు. "వారికి చూపించిన ప్రతి ప్రాజెక్టు, భవనం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినవే. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఒక్క ప్రాజెక్టు పేరు అయినా రేవంత్ చెప్పగలరా?" అని సవాల్ విసిరారు. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.