![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 06:10 PM
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొన్నప్పటికీ, మంత్రి సహా హెలికాప్టర్లోని వారంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి కోదాడకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు. హెలికాప్టర్ గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. అప్రమత్తమైన పైలట్, వెంటనే హెలికాప్టర్ను సురక్షితంగా కిందకు దించేందుకు నిర్ణయించి, కోదాడ సమీపంలోని ఓ ప్రదేశంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.ఈ సమాచారం అందుకున్న వెంటనే స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కోదాడ పర్యటనను రద్దు చేసుకుని, రోడ్డు మార్గంలో హైదరాబాద్కు తిరిగి పయనమయ్యారు. జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపాలు తలెత్తడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది.