|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 09:05 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకోవచ్చని, ఆయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అయితే, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని విమర్శిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ కుటుంబం రాజకీయ లబ్ధి పొందిందని ఆరోపించారు. తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, ప్రశ్నించే హక్కు కేటీఆర్కు లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీది త్యాగాల కుటుంబమని, కేసీఆర్ కుటుంబం ఉద్యమం జరుగుతున్నప్పుడే రాజకీయంగా ఎదిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.విలువల్లేని రాజకీయాలు ఏమాత్రం మంచిది కాదని ఆయన హితవు పలికారు. కేటీఆర్కు నైతిక విలువలు ఉంటే రాహుల్ గాంధీ గురించి మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడవద్దని అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు. కేటీఆర్ తెలంగాణలో రాజకీయం చేసుకోవచ్చని, కానీ రాహుల్ గాంధీని విమర్శించవద్దని ఆయన తేల్చి చెప్పారు.