|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 04:33 PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సాధారణంగా ఈ సమావేశాలు 20 రోజులు జరుగుతాయి. అయితే, ఈసారి 15 రోజుల పాటు మాత్రమే జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 19 వరకు సమావేశాలు జరగనుండగా, ఇందులో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. శీతాకాల సమావేశాలను కుదించడంపై శివసేన (ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు చేశారు.పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరిపే ఉద్దేశం అధికార పక్షానికి ఉన్నట్లు కనిపించడం లేదని ప్రియాంక చతుర్వేది అన్నారు. అహంకారంతో ప్రతిచోట అధికారం నిలుపుకుంటామనే భావన వారిలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ విధానాలను అనుసరించాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయంగా కనిపిస్తోందని అన్నారు.కేవలం 15 రోజులలో 13 బిల్లులు తీసుకురావాలని చూస్తున్నారని, అంటే వీటిపై సరైన చర్చ జరగాలని వారు కోరుకోవడం లేదని అన్నారు. నిరసనల మధ్య ఈ బిల్లులను ఆమోదించాలని చూస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్పుత్ కూడా శీతాకాల సమావేశాలను కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం పార్లమెంటులో చర్చను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ప్రజల కోసం నిర్వహిస్తారని, ప్రతిపక్షాలు ప్రజల తరఫున గళం విప్పడానికి అవకాశం ఉండాలని అన్నారు.