|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 09:43 PM
ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతీ సంవత్సరం వెనుకబడిన వర్గాల నుండి వచ్చే యువతకు విద్యాసహాయం అందిస్తోంది. ఆర్థిక అడ్డంకుల కారణంగా చదువును మధ్యలోనే మానేయాల్సిన పరిస్థితి రాకుండా చేయడం ఈ పథక ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం సుమారు 15 వేల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.30,000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ముఖ్యంగా పేదరికం వల్ల ఉన్నత విద్యను కొనసాగించలేని మహిళా విద్యార్థినుల కోసం ఈ పథకం ఒక దారిదీపంలా మారింది.
ఈ స్కాలర్షిప్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలు లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో 10వ, 12వ తరగతులు పూర్తిచేసి ఉండాలి. 2025–26 విద్యా సంవత్సరంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా ఎంబీబీఎస్ వంటి కోర్సుల్లో మొదటి సంవత్సరం చేరిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది.. ఎటువంటి రుసుము కూడా వసూలు చేయరు.
తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చింది. ఈ పథకం వ్యక్తిగత భవిష్యత్తును మాత్రమే కాదు.. సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని వారు పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుకబడిన ప్రతిభావంతులైన బాలికలు చదువు కొనసాగిస్తే.. రేపటి సమాజంలో నాయకత్వం వహించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే గత సంవత్సరాల్లో ఈ స్కాలర్షిప్ పొందిన అనేక మంది విద్యార్థినులు వైద్య, ఇంజినీరింగ్, సామాజిక శాస్త్ర రంగాల్లో ప్రగతి సాధించారు. దరఖాస్తు చేసుకోవడానికి.. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తున్నారు.
దరఖాస్తు చేసుకునే రాష్ట్రాలు:
అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్.
అవసరమైన డాక్యుమెంట్స్..
ఇటీవల తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫొటో, తెల్ల కాగితంపై సంతకం ఫొటో, ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ లేదా అకౌంట్ స్టేట్మెంట్, 10వ, 12వ తరగతి మార్క్షీట్లు, కాలేజీ బోనాఫైడ్ సర్టిఫికేట్ లేదా ఫీజు రసీదు.
దరఖాస్తు విధానం:
అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాలి. అన్ని దరఖాస్తులు సమీక్షించి, అర్హులైన వారికి స్కాలర్షిప్ మొత్తాన్ని రెండు విడతలుగా రూ.15,000 చొప్పున జమ చేస్తారు. స్కాలర్షిప్ కొనసాగించాలనుకుంటే ప్రతి ఏడాది రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయడమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడుతోంది.