|
|
by Suryaa Desk | Sat, May 24, 2025, 08:59 PM
హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా అనూహ్యంగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో జనజీవనం కొంతమేర స్తంభించింది. ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది.సాయంత్రం బషీర్బాగ్, లక్డికాపూల్, లిబర్టీ, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, ఆల్వాల్, మియాపూర్, లింగంపల్లి వంటి అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరడానికి తీవ్ర అవస్థలు పడ్డారు.దేశ వ్యవసాయానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. శనివారం ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ విభాగం అధికారికంగా వెల్లడించింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు, ఈసారి సుమారు ఎనిమిది రోజుల ముందే దేశంలోకి అడుగుపెట్టడం గమనార్హం.