![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 05:12 PM
రేవంత్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళిక రచిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి హైదరాబాద్లో కొత్త రహదారులు నిర్మాణం, ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపతున్న సంగతి తెలిసిందే. అలానే నగరంలోని పలు ప్రాంతాల్లోని రహదారులు, ఫ్లైఓవర్లకు మరమ్మతులు చేస్తోంది. ఈ క్రమంలో ఆయా మార్గాల్లో కొన్ని రోజుల పాటు రోడ్లను మూసి వేస్తుంది. ఇక తాజగా మాసబ్ ట్యాంక్ మీదుగా వెళ్లే వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు అధికారులు. రానున్న ఆరు వారాల పాటు రాత్రి పూట ఫ్లైఓవర్ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు..
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనదారులకు ముఖ్య గమనిక. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఆరు వారాల పాటు మూసివేయబడుతుంది. రాత్రి 10 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాత్రి వేళల్లో ఫ్లైఓవర్ మరమ్మతు పనులు చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
మెహదీపట్నం వైపు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి పాతికేళ్ల క్రితం అనగా 2001లో మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ను నిర్మించారు. గత 25 ఏళ్లుగా ఇది వాడుకలో ఉంది. ఈక్రమంలో ఫ్లైఓవర్ కొన్ని చోట్ల దెబ్బ తిని వర్షాలు కురిసిన సమయంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో అధికారులు భారీ వర్షాల సమయంలో నీటి లీకేజీని నివారించడానికి మరమ్మతులు చేస్తున్నారు. అరిగిపోయిన స్ట్రిప్ సీల్ జాయింట్లకు జీహెచ్ఎంసీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. అందుకే విడతల వారీగా ఫ్లైఓవర్ మూసివేసి పనులు పూర్తి చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆసిఫ్నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్. కోటేశ్వర్ రావు మాట్లాడుతూ.. రాబోయే ఆరు వారాల పాటు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపారు. వంతెన నిర్వహణ పనుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈవిషయంలో వాహనదారులు సహకరించాలని కోరారు.
మహావీర్ హాస్పిటల్ నుంచి ఎన్ఎండీసీ వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్కు బదులుగా సర్వీస్ రోడ్డును ఉపయోగించాలని సూచించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు సాగించాలని కోరారు. రాత్రిపూట ప్రయాణం చేసేవారు ఈ మార్పును గమనించగలరు. అయితే గతంలో కూడా పలు మార్గాల్లో ఫ్లైఓవర్లను కొన్నాళ్ల పాటు బంద్ చేసిన సంగతి తెలిసిందే. నగరంలో నిత్యం ఏదో చోట మరమ్మత్తులు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇలా ప్రధానమైన రూట్లలో రిపేర్ పనులు చేస్తే.. అవి పూర్తయ్యే వరకు ఆమార్గాల్లో ఆంక్షలు విధిస్తారు.