|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 05:36 PM
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల డ్యామ్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో బైక్ మీదున్న యువకుడు ఎగిరి డ్యామ్లో పడి గల్లంతు కాగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన యువకుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గాలింపు చర్యలు కొనసాగతున్నాయి. ఆ వివరాలు..
మానవపాడు మండలం, బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ అనే 21 ఏళ్ల యువకుడు ఆదివారం నాడు తన స్నేహితులైన జానకిరాములు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రెండు బైక్ల మీద జూరాల డ్యామ్ చూడ్డానికి వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో మహేష్, ఇంకా అతడి స్నేహితులు జూరాల డ్యామ్ బ్రిడ్జీ నుంచి గద్వాల వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో వీరి ఎదురుగా వస్తోన్న ఒక కారు.. బైక్ని ఢీకొట్టింది. దీంతో ఆ బండి మీద కూర్చున్న మహేష్.. ఎగిరి జలాయశంలోకి పడిపోయాడు.
జూరాల ప్రాజెక్టు 42, 43 గేటు గేట్ల వద్ద మహేష్ గల్లంతయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి. యాక్సిడెంట్లో మహేష్ ప్రాజెక్ట్లో పడి గల్లంతు కాగా.. అదే బైక్ నడుపుతున్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మహేష్ డ్యాంలో పడిన సమయంలో అది నిండుగా ఉంది, వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మహేశ్ నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నవారు.. ఘటనా స్థలానికి చేరుకుని యువకులకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో.. అందులో పడిపోయిన మహేష్ని కనిపెట్టలేకపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలనికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. మహేష్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ప్రత్యేక బోట్ల సాయంతో డ్యాం పరిధిలో మహేష్ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలను పరిశీలించగా.. కారు ఒక్కసారిగా ఎడమవైపు నుంచి కుడివైపునకు వచ్చి మరీ ఢీకొట్టినట్లు రికార్డైంది. దీంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఇలా చేశాడా.. లేదా కావాలనే యాక్సిడెంట్ చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.