|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 10:34 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' నేపథ్యంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ ప్రముఖులు, పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా.. హైదరాబాద్లోని కీలకమైన రహదారులకు ప్రఖ్యాత వ్యక్తులు, సంస్థల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రముఖుల పేర్లతో హైదరాబాద్ రహదారులు..
హైదరాబాద్ను ప్రపంచంతో అనుసంధానించే క్రమంలో... వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖుల పేర్లను రోడ్లకు పెట్టడం ద్వారా వారి కృషిని గౌరవించడంతో పాటు.. నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్యూచర్ సిటీ (Future City) లోని ప్రధాన రహదారికి ప్రముఖ పారిశ్రామికవేత్త, దార్శనికుడు రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఆయన చేసిన సేవలకు నివాళిగా నిలుస్తుంది.
అమెరికా దేశానికి చెందిన ప్రముఖులను గౌరవించే విధంగా.. యూఎస్ కాన్సులేట్ వెళ్లే రహదారికి 'ప్రెసిడెంట్ ట్రంప్ ఎవెన్యూ'గా నామకరణం చేయనున్నారు. నగరంలో సాంకేతిక రంగానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పేలా మరికొన్ని కీలక ప్రాంతాలకు ప్రముఖ టెక్నాలజీ సంస్థల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇందులో గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ , విప్రో జంక్షన్ల పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఈ పేర్లకు సంబంధించి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు , అమెరికా రాయబార కార్యాలయానికి త్వరలో లేఖ రాయనుంది.
గ్లోబల్ సమ్మిట్కు ప్రపంచం నలుమూలల నుంచి రానున్న అతిథులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా ప్రణాళికలు రచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చారిత్రక చిహ్నాలైన చార్మినార్ , కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి.. రాష్ట్ర గొప్ప సంస్కృతిని అతిథులకు చూపించనున్నారు. సచివాలయం వద్ద అద్భుతమైన త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ ద్వారా రాష్ట్రం సాధించిన అభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా ప్రదర్శించనున్నారు. 'రైజింగ్ తెలంగాణ - 2047' లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్ప్లేలు ఉండనున్నాయి.