|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:10 PM
ప్రపంచంలోనే అత్యంత చౌకైన వినోదం సినిమా అని, ‘మంచి’ కథతో చిత్రం తీస్తే తనతో సహా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సావిత్రిని స్మరించుకుంటూ ఆమె నటనను కొనియాడారు. "కంటితో కోటి భావాలు, నవరసాలు పలికించగల గొప్ప నటి సావిత్రి. ప్రస్తుతం అలాంటి నటీమణులు లేరని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు" అని ఆయన పేర్కొన్నారు. నేటి సినిమాల్లో కథానాయికల ప్రాధాన్యం తగ్గిపోతోందని, కుటుంబ విలువలతో కూడిన చిత్రాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "అప్పటి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకరినొకరు తాకకుండానే శృంగారాన్ని పండించేవారు. ఇప్పుడు తాకినా, గోకినా ఏమీ జరగడం లేదు. అంత తేడా వచ్చేసింది" అంటూ చురక అంటించారు.సినిమా కేవలం వ్యాపారమే కాదని, అదొక కళాత్మక ప్రక్రియ అని దర్శక-నిర్మాతలు గుర్తుంచుకోవాలని సూచించారు. ‘మహానటి’ చిత్రాన్ని అద్భుతంగా తీశారని చిత్ర యూనిట్ను అభినందించారు. ఇటీవల వచ్చిన ‘బలగం’, ‘35: చిన్న కథ కాదు’, ‘కమిటీ కుర్రాళ్ళు’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయని గుర్తుచేశారు.