|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 09:36 PM
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను 'ఉమీద్' పోర్టల్లో నమోదు చేసేందుకు విధించిన గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ స్వాగతించారు. ఈ అదనపు సమయాన్ని సద్వినియోగం చేసుకొని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు, ముతావల్లీలకు ఆయన పిలుపునిచ్చారు.కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయంపై కీలక ప్రకటన చేశారు. వక్ఫ్ ఆస్తుల నమోదుకు శుక్రవారంతో గడువు ముగిసినప్పటికీ, మరో మూడు నెలల పాటు ఎలాంటి జరిమానా విధించబోమని స్పష్టం చేశారు. ఈలోగా నమోదు చేసుకోలేని వారు తమ రాష్ట్రాల్లోని వక్ఫ్ ట్రైబ్యునళ్లను సంప్రదించవచ్చని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 లక్షల వక్ఫ్ ఆస్తులకు గాను, ఇప్పటివరకు కేవలం 1.51 లక్షల ఆస్తులు మాత్రమే పోర్టల్లో నమోదయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు.గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సాంకేతిక సమస్యలు, శతాబ్దాల నాటి రికార్డుల లభ్యతలో జాప్యం, ముతావల్లీలకు ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేకపోవడం వంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అన్ని ఆస్తుల వివరాలను కచ్చితత్వంతో, పారదర్శకంగా నమోదు చేసేందుకు కనీసం ఏడాది పాటు గడువు పొడిగించాలని కోరారు.వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు, పారదర్శకతను బలోపేతం చేయడానికి ఈ గడువు పొడిగింపు చాలా ముఖ్యం. దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఈ సంస్థల ద్వారా అందే సేవలు, మద్దతు నిరంతరాయంగా కొనసాగుతాయి అని మంత్రి అజారుద్దీన్ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.