|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 08:55 PM
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 'రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన' పేరుతో ఆదివారం మహా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ఒక చార్జ్షీట్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతోందని ఆరోపించారు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు ఏం చేశారని 'ప్రజా పాలన' పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. "కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చారంతే పాలనలో, దోపిడీలో ఎలాంటి మార్పు లేదు అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని సీఎంను నిలదీశారు.నిరుద్యోగ భృతి రూ.4 వేలు, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్ల పెంపు, ఉద్యోగాల భర్తీ వంటి హామీల గతి ఏమైందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బెల్ట్ షాపులను రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు మద్యం అమ్మకాలతో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని విమర్శించారు. ఈ రెండేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే, తనతో బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.