|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 09:01 PM
హైదరాబాద్లోని హైటెక్ సిటీకి అతి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్, అల్లాపూర్ డివిజన్ ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. భూముల ధరలకు, ఇళ్ల అద్దెలకు రెక్కలు రావడంతో.. చిన్నపాటి స్థలాల్లో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపడుతున్నారు.
మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రముఖ ప్రాంతాలకు అల్లాపూర్ డివిజన్ సమీపంలో ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ విలువ అమాంతం పెరిగింది. 50 గజాల నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాల్లో నిర్మాణాలు చేపడితే కోట్లలో లాభాలు వస్తుండడం.. నెలనెల వేలల్లో అద్దెలు వస్తుండడంతో నిర్మాణదారులు జీహెచ్ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. అల్లాపూర్ డివిజన్లోని పద్మావతి నగర్, గాయత్రి నగర్, వివేకానంద నగర్, పర్వత్ నగర్, జనప్రియ నగర్, లక్ష్మీ నగర్, తులసి నగర్, ఫ్రెండ్స్ కాలనీలు అక్రమ నిర్మాణాలకు కేంద్రాలుగా మారుతున్నట్లు తెలుస్తోంది.
ఈ కాలనీలలో కేవలం 50 గజాల స్థలాల్లో సైతం బహుళ అంతస్థుల భవనాలు కనిపిస్తున్నాయి. నిర్మాణదారులు ఇళ్ల నుంచి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో జీహెచ్ఎంసీ నిబంధనలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. నిర్మాణదారులు పనులు చేపట్టే సమయంలో కనీసం సెట్ బ్యాక్ వదలకుండా నిర్మాణాలు చేస్తున్నారు. దీనివల్ల ఇళ్లకు ఇళ్లకు మధ్య కనీసం గాలి, వెలుతురు కూడా దూరే అవకాశం లేకుండా పోతోంది. ఒక ఇల్లు మరో ఇంటికి అతుక్కుని ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.
దీనివల్ల ఆ ప్రాంత నివాసితులు వెంటిలేషన్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస అనుమతులు లేకుండా విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ.. సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిర్మాణదారులు తమ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారం కారణంగానే ఈ అక్రమ నిర్మాణాలు శరవేగంగా వెలుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ కట్టడాలు భవిష్యత్తులో స్థానిక నివాసితులకు పారిశుధ్యం, అగ్నిమాపక భద్రత వంటి సమస్యలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది.