|
|
by Suryaa Desk | Thu, Jul 24, 2025, 06:24 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా.. సామాజిక సేవకు వేదికగా మారాయి. ఈ సందర్భంగా.. మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉదారంగా సహాయం అందించారు. బోయిగూడలోని సెయింట్ ఫిలోమెనాస్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో.. విద్యార్థుల సౌకర్యార్థం 100 బెంచీలను అందించారు. అంతేకాకుండా.. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువులో తొలి రెండు స్థానాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు 20 సైకిళ్లను బహుకరించారు.
‘గిఫ్ట్ ఏ స్మైల్’ అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు.. ఇది జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన నిరంతర సేవా కార్యక్రమం. సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి.. ముఖ్యంగా విద్యార్థులకు సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సైకిళ్ల పంపిణీ విద్యార్థులు పాఠశాలకు సులభంగా చేరుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా వారి హాజరు శాతం పెరుగుతుంది. దీంతో నాణ్యమైన విద్యకు అందించవచ్చు అనేది ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు.. తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారు విద్యార్థులతో ముచ్చటించి.. వారిని ఉన్నత లక్ష్యాల దిశగా ప్రోత్సహించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాజకీయ నాయకులు, ప్రముఖులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించడాన్ని సూచిస్తాయి. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా.. ఇతరులు కూడా సామాజిక సేవలో పాలుపంచుకోవడానికి స్ఫూర్తినిస్తుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ సామాజిక సేవ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది.