|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 03:35 PM
హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ చదువుకునే విద్యార్థులకు కలుషిత, రసాయన అవశేషాలతో కూడిన కూరగాయలకు బదులు.. తాజా కూరగాయలతో చక్కని భోజనాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అక్కడి ప్రాంగణాల్లో పండించడమో, మిద్దెసాగు విధానంలో పండించడమో చేయనున్నారు. ఇందుకు.. ప్రయోగాత్మకంగా జిల్లా పరిధిలోని షేక్పేట్ బాలుర సాంఘిక సంక్షేమశాఖ ఉన్నత పాఠశాల, హయత్నగర్ పరిధిలోని ములుగనూర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ను ఎంపిక చేశారు. అనంతరం జిల్లాలోని ఇతర వసతి గృహాల్లో కార్యక్రమాన్ని చేపడతారు. ఈ విధానంతో రసాయనరహిత కూరగాయలను అందిచండంతోపాటు సిబ్బందికి, విద్యార్థులకు సేంద్రియ పంటలపై అవగాహన కల్పించినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్కు శివారు ప్రాంతాల నుంచి తీసుకొస్తున్న కూరగాయల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయన్న అభిప్రాయాలున్నాయి. ప్రధానంగా సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్లలో కొందరు నాసిరకం కూరగాయలు తీసుకొచ్చి వంటలను తయారు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మిద్దెతోట కార్యక్రమంలో భాగంగా టెర్రస్ గార్డెన్, కిచెన్ గార్డెన్ను అభివృద్ధి చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ అధికారులు ముందుకుసాగుతున్నారు.