|
|
by Suryaa Desk | Fri, Jul 25, 2025, 08:08 PM
భారతదేశంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది. ముఖ్యంగా హనుమకొండ జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులు ఈ పథకాన్ని చురుకుగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద.. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయంతో పాటు, అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తోంది. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడం ద్వారా వారి సాగు వ్యయాన్ని తగ్గించడం.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం.
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సహజ వ్యవసాయం అనేది రైతులు తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పాతుకుపోయిన రసాయన రహిత వ్యవసాయ విధానం. ఇందులో ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడరు. ఇది ఆరోగ్యకరమైన నేల పర్యావరణ వ్యవస్థలను నిర్మించి నిర్వహిస్తుంది. జీవన వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వాతావరణ స్థితిస్థాపకతను పెంచడానికి విభిన్న పంట వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది.
హనుమకొండ జిల్లాలో వ్యవసాయ అధికారులు సహజ వ్యవసాయం (న్యాచురల్ ఫార్మింగ్) అమలును వేగవంతం చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ ఈ విషయాన్ని తెలియజేశారు. జిల్లాలోని 10 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 10 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్లో 125 ఎకరాలు కేటాయించి.. 125 మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో రైతుకు ఒక ఎకరం చొప్పున కేటాయించారు.
ఈ పథకం కింద సహజ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఒక్క ఎకరానికి రూ.4,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. రైతులకు నిరంతరం సలహాలు, సూచనలు అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను కూడా నియమించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 1250 ఎకరాల్లో ఈ పథకం అమలవుతోంది. రైతులు తమకు వెసులుబాటు ఉండే పంటలను.. ఉదాహరణకు పత్తి, మొక్కజొన్న వంటి వాటిని సాగు చేసుకోవచ్చు. సహజ ఎరువులు, జీవపురుగు మందులు వంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారు. రైతులు సొంతంగా సహజ ఎరువులు, పురుగుమందులు తయారు చేసుకునేందుకు కూడా అనుమతిస్తారు.