|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 05:14 PM
ఒకప్పుడు బట్టలు, ఇతర వస్తువులు ఏవైనా కొనాలంటే.. పది షాపులు తిరిగే వారు.. లేదంటే ఓ పది మందిని ఆరా తీసి.. మంచి షాపులు ఎక్కడున్నాయో తెలుసుకుని షాపింగ్కు వెళ్లేవారు. మరి ఇప్పుడో.. అంతా రేటింగ్ మాయ. కర్చీఫ్ నుంచి కంచి పట్టు చీర వరకు ఏం కొనాలన్నా.. ఆన్లైన్లోనే. ఇక్కడ కస్టమర్ పరిగణలోకి తీసుకునేది రేటింగ్. దాని ఆధారంగానే కొనుగోలు చేస్తారు. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి ఇన్స్టా ఖాతాలను ఫాలో అవుతూ షాపింగ్ చేస్తున్నారు.
నేటి కాలంలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ను వాడుతున్నారు. ఏమాత్రం సమయం చిక్కినా ఇన్స్టా రూల్స్ చూస్తూ సమయం గడుపుతుంటారు. యువతలో ఇన్స్టాకున్న క్రేజ్ను వాడుకుని.. తమ బిజినెస్లు ప్రచారం చేసుకుంటున్నారు కొందరు వ్యాపారులు. ఇన్స్టాలో బాగా ప్రచారం చేసుకునేది బట్టల వ్యాపారం.. ఆ తర్వాత ఆభరణాలు. బట్టల విషయానికి వస్తే.. ఫలానా చోట రూ.125లకే బ్రాండెడ్ షర్ట్, రూ.1000కే మూడు షర్ట్స్ అంటూ రీల్స్ తెగ వైరల్ అవుతుంటాయి.
పైగా వీటిల్లో చూపించే బట్టలు చూస్తే.. కొనకుండా ఉండటం కష్టం. రీల్స్ చూసి షాపు దగ్గరకి పరిగెత్తితే.. అసలు మోసం అప్పుడు వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. రూ.2లకే షర్ట్ అంటూ ప్రచారం చేశారు. తీరా షాపు దగ్గరకి వెళ్తే.. పోలీసులు వచ్చి అక్కడి నుంచి తరిమేశారు. మరి ఇంతకు ఏం జరిగిందంటే..
ప్రస్తుతం చాలా మంది యువతను లక్ష్యంగా చేసుకుని ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ వ్యాపారాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈక్రమంలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో ఉన్న చేతన్ మేన్స్వేర్ బట్టల షాపు యజమాని కూడా ఇలానే ఇన్స్టా వేదికగా కేవలం 2 రూపాయలకే షర్ట్ అంటూ ప్రకటించారు. నేడు అనగా సోమవారం ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రచారం చేసుకున్నాడు. 2 రూపాయలకే షర్ట్ అంటే జనాలు ఊరుకుంటారా.. షాప్ దగ్గరకు ఎగబడ్డారు.
2 రూపాయలకే షర్ట్ వస్తుందనే ఆశతో చాలా మంది యువకులు సోమవారం ఉదయం చేతన్ షాపు వద్దకు చేరుకున్నారు. భారీగా యువకులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. ఇంత మంది యువకులను చూసి చేతన్ షాప్ ఓనర్ భయపడ్డాడు. షాప్ బంద్ చేసి.. అక్కడ నుంచి పరారయ్యాడు. కానీ యువకులు మాత్రం వారికి 2 రూపాయలకే షర్ట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడే ఉన్నారు.
విషయం తెలుకున్న పోలీసులు షాప్ వద్దకు వచ్చి యువకులను చెదరగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నర్సాపూర్ పోలీసులు.. షాప్ ఓనర్ చేతన్ కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. అలానే షాపు యజమానులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే.. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాని పోలీసులు తెలుపుతున్నారు.