![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jul 13, 2025, 10:34 PM
హైదరాబాద్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోన్న తెలంగాణ పోలీసులు.. ముఠాలను పట్టుకోడానికి వినూత్నంగా ముందుకెళ్తున్నారు. తాజాగా, నగరంలోని గచ్చిబౌలిలో గంజాయి బ్యాచ్ ను పట్టుకోవడానికి పోలీసులు డెకాయట్ ఆపరేషన్ చేపట్టారు. వాట్సాప్ కోడ్ ద్వారా ఉచ్చులోకి లాగి 14 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం పట్టుబడిన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించారు. మహారాష్ట్రకు చెందిన పెడ్లర్ ఫోన్ ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతంగా చేపట్టి.. గంజాయి బ్యాచ్ ఆటకట్టించారు. గత నెలలో టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ కలకలం రేపిన విషయం తెలిసందే.
వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే డ్రగ్స్ పెడ్లర్ను హైదరాబాద్ ఈగిల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా ఒక పథకం వేశారు. ‘బచ్చా ఆగయా భాయ్’ అనే వాట్సప్ కోడ్ ద్వారా గంజాయి వచ్చిందని కస్టమర్లకు మెసేజ్ పంపారు. అంటే "సరుకు వచ్చేసింది" అని.. గచ్చిబౌలిలో ఒక ప్రదేశానికి రమ్మని చెప్పారు. దీంతో 14 మంది కస్టమర్లు అక్కడికి రాగా.. వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఐటీ ఉద్యోగులు, రిలేషన్షిప్ మేనేజర్లు, ఆన్లైన్ ట్రేడర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు ఉన్నారు. అయితే, ఒక వ్యక్తి తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో రావడం పోలీసులే విస్తుపోయారు.
ఈ 14 మందికి యూరిన్ టెస్ట్ నిర్వహించడంతో అందులో గంజాయి తీసుకున్నట్లు తేలింది. వెంటనే వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించారు. పోలీసులు గంజాయి తీసుకునేవారిని పట్టుకోవడానికి వేసిన ఈ పథకం విజయవంతమైంది. హైదరాబాద్లో ఇటీవల మల్నాడు కిచెన్లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈగల్ టీమ్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పలువురి వైద్యులకు కూడా ఈ కిచెన్ నుంచి డ్రగ్స్ వెళ్లినట్లు గుర్తించింది.
గోవాలో నైజీరియన్ నిక్ నుంచి కొకైన్, ఎండీఎంఏను మల్నాడు కిచెన్ ఓనర్ సూర్య కొనుగోలు చేసినట్లు ఈగల్ టీమ్ విచారణలో వెల్లడయ్యింది. గోవా నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ హైదరాబాద్కు వచ్చేవని.. అక్కడ నుంచి పబ్లు, ప్రముఖులకు అవి సప్లయ్ అయినట్లు తేలింది. మల్నాడు కిచెన్ యజమాని సూర్య అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఈ విచారణలో వెల్లడయ్యింది.