|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 07:33 PM
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్తో అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి తొలిరోజే అద్భుతమైన స్పందన లభించింది. విడుదలైన మొదటి రోజే ఏకంగా రూ. 154 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఈ భారీ ఓపెనింగ్తో, మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 భారతీయ చిత్రాల జాబితాలో ‘ఓజీ’ చోటు దక్కించుకుంది. నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో చేరి పవన్ కల్యాణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో పవన్ కల్యాణ్ ‘ఓజాస్ గంభీర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. ఆయన స్టైలిష్ లుక్స్, పవర్ఫుల్ డైలాగ్స్, తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చాలాకాలంగా అభిమానులు ఆశిస్తున్న అసలైన యాక్షన్ సినిమా ఇదేనంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ భారీ విజయం నేపథ్యంలో, త్వరలోనే విజయోత్సవ వేడుకను నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా, ఈ సినిమా నుంచి తొలగించిన ఓ ప్రత్యేక గీతాన్ని మళ్లీ చేర్చనున్నట్లు తెలుస్తోంది. నటి నేహాశెట్టిపై చిత్రీకరించిన ఈ పాటను తిరిగి సినిమాలో యాడ్ చేయనున్నట్లు సంగీత దర్శకుడు తమన్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.
Latest News