|
|
by Suryaa Desk | Fri, Jul 18, 2025, 09:12 PM
తెలంగాణలో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గొప్ప ఊరట కలిగించింది. నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. సిమెంట్, స్టీల్ వంటి కీలక వస్తువులను తక్కువ ధరలకే అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ధరల నియంత్రణకు ఉన్నతస్థాయి కమిటీ..
ఇటీవల కాలంలో సిమెంట్, స్టీల్ ధరలు విపరీతంగా పెరిగి.. నిర్మాణ ఖర్చులను గణనీయంగా పెంచుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి.. తెలంగాణ ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) ఛైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లాల స్థాయిలో.. ఆయా జిల్లాల కలెక్టర్లు ఛైర్మన్లుగా ఉంటారు. ఈ కమిటీ సిమెంట్, స్టీల్కు ఒక నిర్దిష్ట ధరను నిర్ణయించి, లబ్ధిదారులకు ఆ ధరకే విక్రయించేలా పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా మధ్యవర్తుల దోపిడీని అరికట్టడమే కాకుండా.. లబ్ధిదారులు అధిక ధరలు చెల్లించకుండా రక్షణ లభిస్తుంది.
ఉచిత ఇసుక.. తొలి విడత విజయవంతం..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇప్పటికే లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడత కింద ఇళ్లు కట్టుకుంటున్న వారు ఈ అవకాశాన్ని విజయవంతంగా వినియోగిందచుకున్నారు. ఇప్పుడు సిమెంట్, స్టీల్ ధరల నియంత్రణ కూడా తోడు కావడంతో.. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది.
ఈ పథకం ద్వారా లబ్ధిదారులు తమ కలల ఇంటిని నిర్మించుకోవడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిర్మాణ రంగంలో ధరల స్థిరత్వం లేకపోవడం వల్ల పేదలు ఇళ్లు కట్టుకోవడానికి వెనకాడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ తాజా నిర్ణయం వారికి ఎంతో ధైర్యాన్నిస్తుంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును మరింత వేగవంతం చేస్తుందని.. తద్వారా రాష్ట్రంలో గృహ నిర్మాణ లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ చర్యలు నిరుపేదల సొంతింటి కలలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.