![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 14, 2025, 12:13 PM
మనుషులు చనిపోయినా కల్లుకాంపౌండ్ నిర్వాహకులు కనికరం కలగడం లేదు. అధికారులు కాంపౌడ్లు సీజ్ చేసిన కళ్లు తెరవడం లేదు. అరెస్ట్లు చేసినా అదో లెక్క కాదంటున్నారు.ఇష్టారీతిన కల్తీ కల్లును అమ్మేస్తున్నారు. కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటన కల్లోలం రేపుతుండగానే నగరంలో మరో చోట కల్తీ కల్లు ఘటన ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. జీడిమెట్ల రామ్రెడ్డి నగర్లో భార్యభర్తలు కల్తీకల్లు సేవించారు. వెంటనే అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. రెండురోజుల క్రితం కూతురు దగ్గరకు వచ్చిన లచ్చిరాం దంపతులు..రామ్రెడ్డినగర్లోని కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగి ఆస్పత్రి పాలయ్యారు.మరోవైపు కల్తీ కల్లు ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్. కల్తీ కల్లు కాంపౌండ్ నిర్వహణ కల్లు వినియోగం అమ్మకాల్లో జరుగుతున్న తప్పిదాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. కల్లు విక్రయించే నిర్వాహకులపై గట్టి నిఘా పెట్టాలని ఎక్సైజ్ సిబ్బందిని ఆదేశించారు కమిషనర్.
హైదరాబాద్ కల్తీ కల్లు ఘటనలో బాధితులకు నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుంది. నిమ్స్లో 30 మంది, గాంధీ ఆసుపత్రిలో 18 మందికి చికిత్స పొందుతున్నారు. నిమ్స్ నుంచి నిన్న ఐదుగురు బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. గాంధీ ఆస్పత్రిలో నలుగురికి డయాలసిస్ కొనసాగుతుంది. మిగిలిన 14 మంది బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, డాక్టర్లకు మంత్రి సూచించారు.