![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 07:17 PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఆమె చేసిన వ్యాఖ్యలు, గాంధీ భవన్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించిన కారణంగా సునీతా రావుకు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఈ నోటీసులు పంపినట్లు సమాచారం. పార్టీలో ఏవైనా సమస్యలుంటే అంతర్గత వేదికలపై చర్చించాలని, బహిరంగంగా ఆరోపణలు చేయడం, నిరసనలకు దిగడం సరికాదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నోటీసులో, సునీతా రావు తన వైఖరిపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిర్దేశిత గడువులోగా సమాధానం రాకపోతే, కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్లు సమాచారం.కొద్ది రోజుల క్రితం సునీతా రావు, గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట కొందరు మహిళా నాయకులతో కలిసి ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో మహిళా నేతలకు నామినేటెడ్ పదవుల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని, వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం, కార్పొరేషన్ పదవుల్లోనూ మహిళలకు తగిన వాటా దక్కడం లేదని, పార్టీ నాయకత్వం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా, మహేష్ గౌడ్ తన బంధువులకే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి.అధికార పార్టీలో ఉంటూ, పార్టీ కార్యాలయంలోనే టీపీసీసీ అధ్యక్షుడిపై ఆరోపణలు చేస్తూ నిరసనకు దిగడాన్ని జాతీయ మహిళా కాంగ్రెస్ నాయకత్వం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సునీతా రావుకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.