|
|
by Suryaa Desk | Sun, Dec 28, 2025, 01:59 PM
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించానని చెప్పి సహజీవనం చేసిన యువకుడే తమ బిడ్డను చంపాడంటూ యువతి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. నిజాంపేట్ మండలం మాణిక్ నాయక్ తండాలో యవతి మృతదేహాన్ని ప్రియుడి ఇంటి ముందు ఉంచి శనివారం రాత్రంతా ఆందోళన చేశారు. ఈ ఘటనతో తండాలో ఉద్రిక్తత నెలకొనగా.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి యువతి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధిత యువతి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సిర్గాపూర్ మండలం కడపల్ విఠల్నాయక్ తండాకు చెందిన వడితే కావేరి, మాణిక్ నాయక్ తండాకు చెందిన సభావత్ శ్రీకాంత్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇద్దరూ హైదరాబాద్ కు వెళ్లిపోయారు. ఎల్బీనగర్ లో సహజీవనం ప్రారంభించారు. అయితే, ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కావేరి మనస్తాపం చెంది శనివారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.కావేరి కుటుంబ సభ్యులు మాత్రం శ్రీకాంతే తమ కూతురిని చంపేశాడని ఆరోపిస్తున్నారు. ఉరి వేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావేరి మృతదేహాన్ని మాణిక్ నాయక్ తండాకు తీసుకెళ్లి శ్రీకాంత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంత వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని తేల్చిచెప్పారు.