|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 05:32 PM
వ్యూస్ వ్యామోహంలో విలువలు విస్మరిస్తే ఎలాగని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రశ్నించారు. కేవలం వ్యూస్, లైక్స్ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందడానికి చిన్నారుల భవిష్యత్తును పణంగా పెట్టడం సముచితం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పిల్లలతో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలను ఉద్దేశించి ఆయన 'ఎక్స్' వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. చిన్నారులతో అసభ్యకరమైన కంటెంట్ సృష్టిస్తూ సమాజానికి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్నారులు, యువతకు స్ఫూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి సమాజాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. పిల్లలతో ఇష్టానుసారంగా వీడియోలు చేసి వారిని తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు. ఇటువంటి చర్యలు పోక్సో, జువైనల్ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తాయని, ఇది పిల్లలను వేధించినట్టు అవుతుందని ఆయన అన్నారు.మైనర్లతో సహా ఈ తరహా కంటెంట్ సృష్టించి వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.