|
|
by Suryaa Desk | Sat, Jul 26, 2025, 07:59 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని కేటీఆర్ తనతో స్వయంగా అన్నారని రమేష్ ఆరోపించారు. ఈ ఆరోపణ నిజమో, కాదో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కేటీఆర్.. బీజేపీ, కాంగ్రెస్లు కలిసి తెలంగాణలో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. హెచ్సీయూ భూముల అమ్మకంలో ప్రభుత్వానికి సహకరించిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు క్విడ్ ప్రోకోగా సీఎం రేవంత్ రెడ్డి రూ.1,600 కోట్ల రోడ్డు కాంట్రాక్టును కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సీఎం రమేశ్.. కేటీఆర్ ఇంట్లో కుంపటి రగులుకుందని, దానిని దారి మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు.
సీఎం రమేష్ కేటీఆర్ ఆరోపించిన రూ.1,600 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించి వివరణ ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ కోసం చాలా కంపెనీలు పోటీ పడ్డాయని.. రెండు ప్యాకేజీలలో ఒకటి రుత్విక్ ప్రాజెక్ట్కు, మరొకటి ఎల్ అండ్ టీకి దక్కాయని స్పష్టం చేశారు. తాను రుత్విక్ ప్రాజెక్టులో డైరెక్టర్గా లేనని పేర్కొన్నారు. రూ.5 లక్షలకు మించిన ఏ ప్రాజెక్టు కూడా నామినేషన్ పద్ధతిలో కేటాయించబడదని.. టెండర్ ప్రక్రియ ద్వారానే జరుగుతుందని కేటీఆర్కు తెలియదా అని రమేష్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక కంపెనీకి వర్క్ ఇవ్వగలరా అని ప్రశ్నిస్తూ.. 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదే చేశారా అని నిలదీశారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది పనిచేశారనే దానిపై చర్చించడానికి తాను సిద్ధమని.. కేటీఆర్ ఎక్కడ చెప్పినా అక్కడికి వస్తానని సవాలు విసిరారు.
‘బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతిపై ఈడీ, సీబీఐ రాకుండా చూడండి... కవిత బయటకు వచ్చేలా చూడండి... మేము దేనికైనా సిద్ధం అని ఆరోజు కేటీఆర్ మాట్లాడారు’ అని సీఎం రమేష్ ఆరోపించారు. అంతేకాకుండా.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి గానీ, బీజేపీతో పొత్తుకు గానీ సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తనతో చెప్పారని, తాను అప్పుడు పెద్దలతో మాట్లాడి చెప్పాలని అన్నానని, వారు వద్దని అన్నారని చెప్పిన తర్వాత కేటీఆర్ ఎంత బాధపడ్డారో కూడా తనకు తెలుసని పేర్కొన్నారు.
రాజకీయంగా ఎందుకు సరిగ్గా వెళ్లడం లేదని, తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులను ఎందుకు దూరం చేసుకున్నారని తాను అడిగినప్పుడు.. ‘‘చంద్రబాబు నాయుడు కమ్మ... కమ్మ నా కొడుకులు మాకు అవసరం లేదని అన్నావు... అప్పుడు కొంచెం నోరు తగ్గించుకుని మాట్లాడమని నేను చెప్పాను’ అని రమేష్ ఆరోపించారు. రెడ్లను నమ్మితే ప్రభుత్వం మారిన మరుసటి రోజే పోయారని వారిని కూడా తిట్టారని.. రాజకీయాల్లో దీర్ఘకాలం ఉండాలంటే ఇలా మాట్లాడటం సరికాదని తాను హితబోధ చేశానని పేర్కొన్నారు.
‘అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు... చంద్రబాబు నాయుడును చూసి కమ్మ వాళ్లు పోయారు... మాకు (బీఆర్ఎస్) మిగిలింది జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే అని అన్నావు... జగన్ కోసం ఉంటామని కూడా చెప్పావు.. అని సీఎం రమేష్ తెలిపారు. తెలంగాణలో రేపటి రోజున బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవనే భయంతోనే కాంగ్రెస్, బీజేపీల మధ్య బంధం ఉందని కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీల మధ్య బంధం ఉంటుందా..? ఎవరైనా దీనిని నమ్ముతారా అని ప్రశ్నించారు. కేటీఆర్ మాట్లాడే భాష తీరును తప్పుబట్టారు. కేటీఆర్ తన గురించి మాట్లాడాడు కాబట్టే ఈ విషయాలను బయటకు చెబుతున్నానని.. అవి ప్రైవేట్ చర్చలని, అక్కడ ఇంకా కొందరున్నారని.. ఆ వివరాలు బయటకు చెప్పకూడదని, ఆ బాధ్యత తనపై ఉందని తెలిపారు. కేటీఆర్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. కేటీఆర్ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలపై స్పందించారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ వస్తే తాను చర్చలకు సిద్ధం అన్నారు. బీఆర్ఎస్ను బీజేపీలోకి విలీనం చేసే అంశాన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని.. ఈ పార్టీ దేనిలో విలీనం కాదని స్పష్టం చేశారు.