![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 17, 2025, 06:39 AM
బస్సు, వ్యాన్, ఆటో డ్రైవర్లు ఉదయం వేళల్లో సైతం మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. అందుకే ఇకపై పగటిపూట కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఈ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు.నగరంలోని ట్రాఫిక్ పోలీసులు నిన్న పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభించారు. మింట్ కాంపౌండ్లో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు వారాంతాల్లో రాత్రి మాత్రమే చేస్తారనే భావన ప్రజల్లో నెలకొందన్నారు. అయితే, జూన్ నెలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఓ పాఠశాల బస్సు డ్రైవర్ మద్యం సేవించి పట్టుబడగా, మొత్తం 35 మంది పాఠశాల బస్సు డ్రైవర్లు ఈ తనిఖీల్లో పట్టుబడటం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్లో మైనర్లు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మైనర్ల డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటి వరకు 4,500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశామని తెలిపారు. 2,800 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆర్టీవో అధికారులకు సమాచారం అందించామన్నారు. మైనర్లు డ్రైవింగ్లో పట్టుబడితే 25 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.