|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 01:29 PM
నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాదిని ఎన్.ఐ.ఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బుధవారం తెల్లవారుజామున బోధన్ పట్టణంలో ఎన్.ఐ.ఏ, పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ను అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుడిని బోధన్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్.ఐ.ఏ, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచారు.ఈ క్రమంలో రాంచీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హషన్ డ్యానిష్ను అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్.ఐ.ఏ అధికారులు గాలింపు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్టు చేశారు.