|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 05:47 PM
సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు రకరకాల హామీలు ఇస్తుంటారు. గెలిచిన తర్వాత ఆ హామీలను నెరవేర్చి ప్రజల మెప్పు పొందాలని తపిస్తుంటారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లోనూ చాలా మంది అభ్యర్థులు హామీలు ఇచ్చారు. గెలిచాక వాటిని నెరవేర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా.. హనుమకొండ జిల్లాలోని ఇద్దరు సర్పంచ్లు తాము ఇచ్చిన హామీని నెరవేర్చి చిక్కుల్లో పడ్డారు. పోలీసు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్రామంలోని వీధికుక్కల బెడదను తొలగిస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో వారు ఎంచుకున్న 'కిరాతక మార్గం' ఇప్పుడు వారిని చిక్కుల్లో పడేసింది.
హనుమకొండ జిల్లా శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో వీధికుక్కల బెడద తీవ్రంగా ఉండేది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇచ్చారు. అయితే గెలిచిన తర్వాత శాస్త్రీయ పద్ధతుల్లో వాటిని నియంత్రించాల్సింది పోయి.. అత్యంత అమానుషంగా 120కి పైగా కుక్కలను చంపి పాతిపెట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు రావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.
'స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' ప్రతినిధులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వెటర్నరీ వైద్యులు గ్రామంలో తవ్వకాలు జరపగా.. పాతిపెట్టిన 120కి పైగా కుక్కల కళేబరాలు లభ్యమయ్యాయి. పశువైద్యులు అక్కడికక్కడే వాటికి పోస్టుమార్టం నిర్వహించి, శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు. విషప్రయోగం ద్వారానే ఈ మూగజీవాలను హతమార్చినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై గ్రామస్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుక్కకాటు వల్ల తాము పడుతున్న ఇబ్బందులు, ఆ కుక్కలకు సోకిన చర్మ వ్యాధుల కారణంగా ప్రబలుతున్న అనారోగ్యాల దృష్ట్యా సర్పంచ్ల చర్యను కొందరు సమర్థిస్తున్నారు. అయితే జంతు హింస నిరోధక చట్టం (PCA Act, 1960) ప్రకారం వీధికుక్కలను చంపడం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలో ఇద్దరు సర్పంచ్లు సహా మొత్తం 9 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాశంగా మారింది.