|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:02 PM
హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒక యువతికి ఆ బాధ నుంచి ఉపశమనం కల్పించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి గత మూడేళ్లుగా వక్షోజాల పరిమాణం అసాధారణంగా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. నడవడం, కూర్చోవడం వంటి దైనందిన పనులకు కూడా ఆటంకం కలుగుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిని ఆశ్రయించారు.
యువతిని పరీక్షించిన జనరల్ సర్జరీ విభాగం వైద్యులు.. ఆమె ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సొంత కణజాలంపైనే దాడి చేయడం వల్ల ఇలాంటి అసాధారణ పెరుగుదల సంభవిస్తుందని వైద్యులు తెలిపారు. ఆమె వయస్సును దృష్టిలో ఉంచుకుని.. మానసిక వేదన నుంచి ఆమెను గట్టెక్కించేందుకు మామోప్లాస్టీ (Mammoplasty) శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కె. సునీల్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ ఆపరేషన్ను చేపట్టింది. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ ప్రక్రియలో అదనపు కణజాలాన్ని తొలగించి.. వక్షోజాలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. కేవలం పరిమాణం తగ్గించడమే కాకుండా.. శరీర ఆకృతికి తగినట్లుగా పునర్నిర్మించడం ఈ సర్జరీలో కీలకం. అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మదాల రోగికి మత్తు మందు ఇచ్చే ప్రక్రియను పర్యవేక్షించారు.
వక్షోజాల అసాధారణ పెరుగుదల అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు.. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు పేర్కొన్నారు. బరువు పెరగడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడి తీవ్రమైన వీపు నొప్పి, మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. చర్మం రాపిడికి గురై ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. ఈ సర్జరీ తర్వాత 20 రోజుల పాటు వైద్యులు ఆమెను పర్యవేక్షించి, ఎటువంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారించారు.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ సంక్లిష్టమైన సర్జరీని గాంధీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా నిర్వహించడం గమనార్హం. ఈ విజయం సాధించిన వైద్య బృందాన్ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది.