|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 07:48 PM
వరంగల్ నగరంలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన శ్రీభద్రకాళి ఆలయ రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆలయ మాడవీధుల నిర్మాణ పనులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మోక్షం కలిగించింది. ఈ పనుల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద 20 కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిధులను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.
భద్రకాళి ఆలయ అభివృద్ధి, మాడవీధుల నిర్మాణం కోసం మొత్తం 30 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి 20 కోట్ల రూపాయలను కేటాయించింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) తన వంతుగా మరో 10 కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించనుంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించడంతో.. నిధుల విడుదలకు మార్గం సుగమమైంది.
ఈ ప్రాజెక్టు కింద సుమారు 1.5 కిలోమీటర్ల మేర విశాలమైన మాడవీధులను నిర్మించనున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 8 కోట్ల రూపాయల వ్యయంతో భద్రకాళి చెరువు పంప్ హౌస్ ఆధునికీకరణ, శ్రీవల్లభ గణపతి ఆలయ సమీపంలో పనులు, కాపువాడ చెరువు మట్టితో పల్లపు ప్రాంతాలను నింపే ప్రక్రియ దాదాపు పూర్తయింది. మాడవీధుల నిర్మాణంలో భాగంగా చెరువు లోపలి వైపు రాతి కట్టడం (స్టోన్ రివిట్మెంట్), గ్రానైట్ ఫ్లోరింగ్, పచ్చదనం (గ్రీనరీ), ఆధునిక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో అమ్మవారి ఉత్సవ మూర్తి ఊరేగింపు అత్యంత వైభవంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా ఈ వీధులను తీర్చిదిద్దుతున్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో.. మిగిలిన పనుల కోసం అధికారులు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు. మూడు నెలలుగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. ఓరుగల్లు పర్యాటక రంగంలో భద్రకాళి ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాడవీధుల నిర్మాణం పూర్తయితే భక్తులకు కనీస సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా.. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయి.