|
|
by Suryaa Desk | Wed, Jul 30, 2025, 07:37 PM
తెలంగాణ రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించనుంది. గతంలో వివిధ కారణాలతో విధుల్లోంచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు.. వారిని తొలగించిన సర్క్యులర్ను రద్దు చేసి.. తిరిగి విధుల్లోకి తీసుకునే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇది తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లలో ఎంతో సంతోషాన్ని నింపింది.
తొలగింపు కారణాలు..
గత ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్లను కొన్ని కారణాలతో విధుల్లోంచి తొలగించారు. ప్రధానంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీల హాజరు నమోదు, పని ప్రదేశాల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే.. హాజరు నమోదులో అక్రమాలు, అవినీతి ఆరోపణలు, పని తీరులో లోపాలు వంటి కారణాలతో వారిని తొలగించారు. అంతేకాకుండా.. కొన్ని సందర్భాల్లో రాజకీయ కారణాలు కూడా వారి తొలగింపునకు దారితీశాయని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
తాజాగా.. ఫీల్డ్ అసిస్టెంట్స్ అసోసియేషన్ నేతలతో మంత్రి సీతక్క సమావేశం నిర్వహించారు. ఈ చర్చలలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇస్తున్న జీతాలలో తేడాలు ఉన్నాయని, వాటిని కూడా సవరించి ఒకే విధమైన వేతనాన్ని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ వేతన సవరణ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పరిచే అవకాశం ఉంది.
అలాగే.. ఫీల్డ్ అసిస్టెంట్ల బదిలీలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. వీటితో పాటు.. వారికి హెల్త్ ఇన్సూరెన్స్, వ్యక్తిగత, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి చర్యలు చేపడతామని ఆమె తెలియజేశారు. ఈ బీమా సౌకర్యాలు, వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంతో.. ఇన్నాళ్లుగా తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిరీక్షిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.