![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:36 PM
ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమాన ప్రయాణికులకు బుధవారం భయానక అనుభవం ఎదురైంది. మార్గమధ్యంలో తీవ్రమైన వాతావరణ మార్పుల కారణంగా విమానం గాలిలో భారీ కుదుపులకు లోనైంది. ఈ విమానంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల బృందం కూడా ఉండగా, వారిలో ఒకరైన సాగరిక ఘోష్ ఈ ఘటనను ‘మృత్యువు అంచుల వరకు వెళ్లిన అనుభవం’గా అభివర్ణించారు.టీఎంసీకి చెందిన డెరెక్ ఓబ్రెయిన్, నదీముల్ హక్, సాగరిక ఘోష్, మానస్ భునియా, మమతా ఠాకూర్లతో కూడిన ఐదుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈ విమానంలో ప్రయాణిస్తోంది. శ్రీనగర్ వెళ్తుండగా ఆకస్మికంగా వడగళ్ల వాన మొదలవ్వడంతో విమానం అదుపుతప్పినంత పనైంది. ఈ కుదుపుల తీవ్రతకు పైలట్ శ్రీనగర్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు ‘ఎమర్జెన్సీ’ పరిస్థితిని నివేదించాల్సి వచ్చింది.ఈ భయానక క్షణాల గురించి సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. "ఇది దాదాపు చావును చూసినట్లే ఉంది. నా జీవితం ముగిసిపోయిందనే అనుకున్నాను. ప్రయాణికులంతా భయంతో కేకలు వేశారు, దేవుడిని ప్రార్థించారు, తీవ్ర ఆందోళనకు గురయ్యారు" అని తెలిపారు. "అంతటి క్లిష్ట పరిస్థితిలోంచి మమ్మల్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పైలట్కు హ్యాట్సాఫ్. విమానం ల్యాండ్ అయ్యాక చూస్తే దాని ముక్కు భాగం దెబ్బతిని ఉంది" అని వివరించారు. ల్యాండింగ్ అనంతరం తమ బృందం పైలట్కు కృతజ్ఞతలు తెలిపిందని కూడా ఆమె పేర్కొన్నారు.