![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 04:53 PM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై చేసిన దుష్ప్రచారం తేలిపోయిందని, సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలో తేలిపోతుందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీఛమైన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణలో భవన్లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ చిట్చాట్ చేశారు. 'ప్రజాపాలన పర్సంటేజీ పాలనగా మారిందని, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ నోటీసులు. కాంగ్రెస్ పార్టీ కమిషన్లు బయటపడుతున్నాయని తెలిశాకే.. ఇప్పుడు నోటీసుల పేరిట తమాషాలు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై వ్యాఖ్యానించింది. జస్టిస్ గోష్ తన నివేదిక పూర్తయిందని, విచారణ పూర్తయిందన్నారు. అయితే కమిషన్ గడువు మళ్లీ ఎందుకు పొడిగించారో ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదు. అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలను కూలగొట్టి మళ్లీ టెండర్ల పిలిచి, 20 నుంచి 30 శాతం కమిషన్లు తీసుకోవాలన్నదే అసలు ఏజెండా. సుప్రీంకోర్టుకు కాళేశ్వరం ప్రాధాన్యత, గొప్పతనం అర్థమైంది. సెంట్రల్ వాటర్ కమిషన్కు అర్థమైంది, అందుకే 'ఇరిగేషన్ మార్వెల్' అన్నారు. న్యాయమూర్తులకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ అధికారంలో ఉన్న అజ్ఞాని ముఖ్యమంత్రికి అర్థమవడం లేదు. పాలమూరు-రంగారెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. పాలమూరు-రంగారెడ్డిని వెంటనే పూర్తిచేసి మహబూబ్నగర్ ప్రజలకు సాగునీరు ఇవ్వాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాలమూరు బిడ్డను అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టారు?. పాలమూరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టే, కాళేశ్వరంపైన కూడా స్పష్టమైన తీర్పులు వస్తాయి. కాళేశ్వరం ప్రాధాన్యతను ప్రజలకు, ఈ మూర్ఖ కాంగ్రెస్ నాయకులకు అర్థమయ్యేలా చెబుతాయి. అందాల పోటీలకు రూ.200 కోట్లా.. 580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ముఖ్యమంత్రి అందాల పోటీలో ఉండడం కరెక్టా?. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే, అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ప్రమాదం జరిగితే ఒక్కసారి పోనీ రేవంత్ రెడ్డి అందాల పోటీలకు నాలుగు సార్లు పోయాడు. రాష్ట్ర ప్రభుత్వ దగ్గర ఒక రూపాయి కూడా లేదు అని చెప్పి, అందరూ దొంగల్లా చూస్తున్నారంటూ.. రూ.200 కోట్లు అందాల పోటీలకు ఖర్చు పెట్టడం కరెక్టా?. మిస్ వరల్డ్ కాంటెస్టులకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారు. మంత్రులు సొంగ కార్చుకుంటూ అందాల పోటీలో పాల్గొంటున్నారని సీపీఐ నారాయణ అన్నారు. మిస్ వరల్డ్ బ్యూటీస్.. కాళేశ్వరం మీద నోటీసులు.. ఇదే రేవంత్ రాజకీయం. మిస్ వరల్డ్ బ్యూటీస్కి కూడా రేవంత్ రెడ్డి చూపిస్తున్నది అంతా తమ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులు మాత్రమే. నిజాం కట్టిన చార్మినార్ లేదా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు తప్ప, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఒక్కదానినైనా రేవంత్ రెడ్డి చూపించగలడా? కాళేశ్వరంలోని రెండు పిల్లర్లకు ఇంత రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఏం చేసింది?. మూడు నెలల తర్వాత కూడా అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయలేకపోయారు. కమీషన్ల కోసం ఎస్ఎల్బీసీని హడావిడిగా మొదలుపెట్టారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే, మగోడు అయితే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేవాడు. ఇదే విధంగా కాళేశ్వరం విషయంలో కూడా దాని ప్రాధాన్యత బయటకు వస్తుంది. రేవంత్ రెడ్డిలో అపరిచితుడు ఉన్నాడు.. ఒకరోజు కాలేశ్వరాన్ని 'కూలేశ్వరం' అంటాడు. రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉంది. 'మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్' అనే మానసిక రుగ్మతతో ఉన్నాడు. అందుకే ఒకే అంశంపై ఆయన రోజుకోలా మాట్లాడతారు. మరో రోజు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తామంటారు. వాళ్ల ప్రభుత్వంలోని మంత్రులు రంగనాయక సాగర్ నుంచి నీళ్లకు జెండాలు ఊపుతారు. ఒక రోజు అప్పు లేదు అంటారు.. మరొక రోజు అసెంబ్లీలో రూ.1,70,000 కోట్ల అప్పు చేశామని అంటారు. ఒక రోజు కాకతీయ కళాతోరణం అధికార చిహ్నంగా వద్దంటారు. మరొక రోజు అందాల పోటీదారులకు దాన్ని చూపిస్తారు. ఒక రోజు కేసీఆర్ ఆనవాళ్లు తొలగిస్తామని అంటారు. మరొక రోజు కేసీఆర్ కట్టిన ప్రతిదీ తిరిగి చూపిస్తారు.' అని కేటీఆర్ అన్నారు.