|
|
by Suryaa Desk | Wed, Oct 15, 2025, 08:36 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని వందల నిర్మాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. వేల కోట్ల విలువన ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపించారు. కాలనీల రోడ్లను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేశారు. పలువురు పార్కు స్థలాలు కబ్జా చేయగా.. వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చారు. తాజాగా.. రాజేంద్రనగర్ పరిధిలోని బద్వేల్- ఉప్పరపల్లి గ్రామాలలో బుధవారం హైడ్రా ఆధ్వర్యంలో భారీగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2లోని కబ్జాకు గురైన 4 పార్కు స్థలాలకు హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు. 19,878 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్థలం విలువ రూ. 139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సుమారు 120 ఎకరాల్లో హుడా (ఇప్పుడు హెచ్ఎండీఏ) అప్రూవల్తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్లో పార్కుల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయంటూ హైడ్రాకు ప్రజావాణి ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఆక్రమణలు జరిగినట్లు ధృవీకరించారు.
నిర్ధారణ అనంతరం బుధవారం హైడ్రా సిబ్బంది పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించారు. ఆక్రమణదారులు పార్కు స్థలాల్లో నిర్మించుకున్న ప్రహరీలు, షెడ్లు, చిన్న గదులను పూర్తిగా కూల్చివేశారు. ఆ తర్వాత తిరిగి ఆక్రమణ జరగకుండా ఉండేందుకు ఆ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రజా ప్రయోజనాలకు కేటాయించిన పార్కులు, ఓపెన్ స్పేస్లు, రోడ్లు వంటి స్థలాలను కాపాడటంలో హైడ్రా తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు గట్టి హెచ్చరికగా నిలుస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న ఈ స్థలాలను త్వరలో అభివృద్ధి చేసి, స్థానిక ప్రజలకు పార్కులుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక ఇటీవల కూడా హైడ్రా పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి ప్రభుత్వ స్థలాలను కాపాడింది. నగర ప్రజల భవిష్యత్తు కోసమే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.