|
|
by Suryaa Desk | Tue, Jul 29, 2025, 07:42 PM
తెలంగాణలో రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రా పని తీరుపై ఎక్కడ చూసినా ప్రశంసల వర్షం కురుస్తోంది. హైడ్రా వచ్చిన తర్వత.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టేవారు.. ఆక్రమణలకు పాల్పడుతున్న వారు భయంతో ఒణికిపోతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడం ఆలస్యం.. వెంటనే రంగంలోకి దిగి.. ఫిర్యాదు అందిన ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయితే చాలు.. వెంటనే వారి భరతం పడుతోంది. ప్రభుత్వ స్థలాలు, ఆస్తులన పరిరక్షణతో పాటుగా నగరంలోని చెరువుల పరిరక్షణ బాధ్యత కూడా హైడ్రా మీదనే ఉంది. ఈక్రమంలో తాజాగా హైడ్రా మూసాపేటలో 2 వేల గజాల పార్కు స్థలాన్ని అక్రమార్కుల చెర నుంచి కాపాడి.. అందరి ప్రశంసలు పొందుతుంది. ఆ వివరాలు..
అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై కొరడా ఝుళిపిస్తోన్న హైడ్రా.. తాజాగా మంగళవారం నాడు.. హైదరాబాద్లోని మూసాపేట, ఆంజనేయనగర్లో ఉన్న ఆక్రమణలు తొలగించింది. యాసిన్ అనే వ్యక్తి పార్కు స్థలంపై కన్ను వేసి దాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేయసాగాడు. ఈక్రమంలో యాసిన్ రోడ్డుకు ఒకవైపు టెంట్ సామాన్ల దుకాణం నిర్వహించసాగాడు. ఇక దుకాణానికి ఎదురుగా ఉన్న 2 వేల గజాల పార్కు స్థలంలో టెంట్ సామాన్లు, సౌండ్ సిస్టమ్ మెటీరియల్, జనరేటర్ల రిపేరింగ్ తదితర వ్యాపార కార్యక్రమాలకు వినియోగించేవాడు. దీని గురించి గతంలో జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన లాభం లేకపోయింది.
ఈక్రమంలో హైడ్రా వ్యవస్థ ఏర్పాటు అయిన తర్వాత.. పార్కు స్థలం ఆక్రమణ గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా బృందం.. ఘటనా స్థలాన్ని పరిశీలించించింది. హుడా లేఔట్ ప్రకారం రెండు వేల గజాలను పార్కు కోసం కేటాయించిన స్థలంగా హైడ్రా అధికారులు నిర్ధారించారు. కబ్జా చేసి నిర్మించిన టెంట్ హౌజ్ను హైడ్రా అధికారులు మంగళవారం నాడు కూల్చి వేశారు.
గతంలో ఈ పార్కు అభివృద్ధికి రూ.50 లక్షలు విడుదల చేసింది జీహెచ్ఎంసీ. ఈ మొత్తంతో పార్కు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన వారిని కబ్జాదారులు అడ్డుకున్నారు. ఈక్రమంలో స్థానికులు ఇటీవల పార్కు కబ్జా గురించి హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా దీని మీద విచారణ చేసి కబ్జాలు తొలగించింది. ఇనుప తీగతో ఫెన్సింగ్ వేసింది. ఈక్రమంలో లే ఔట్ ప్రకారం పార్కును అభివృద్ధి చేయాలంటూ స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.