రేవంత్ రెడ్డి జేబు దొంగ : కేటీఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం అసమర్థతలో ‘ప్రో మ్యాక్స్’, అవినీతిలో ‘ఆల్ట్రా మ్యాక్స్’, అరాచకంలో ‘హై మ్యాక్స్’గా మారిందని ఎద్దేవా చేశారు. వెయ్యి రోజుల్లో వెయ్యికి పైగా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో దేశంలోనే తొలిసారిగా రైతు బీమా అమలు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బీమా వ్యవస్థను నాశనం చేసిందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు నిలిచిపోయి ‘రాహుల్ బంధు’ మొదలైందని, రైతుల డబ్బులు దొంగలించిన ‘జేబుదొంగ’ రేవంత్రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
యువతకు ఇచ్చిన హామీలపై ప్రశ్నలు
కాంగ్రెస్కు ఓటేసిన యువతకు ఇప్పుడు ఏం మిగిలిందని కేటీఆర్ ప్రశ్నించారు. జెన్జీతో ఫోజులు కొడుతున్న రాహుల్గాంధీకి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయా అని నిలదీశారు. యువత ఉద్యోగాలు అడుగుతుంటే ప్రభుత్వం జేబులు నింపుకోవడంలో బిజీగా ఉందని ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాల్లో యువతకు ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 97పైనా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పారు. రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిందని కేటీఆర్ ఆరోపించారు.