రైతులకు ఆర్థిక భరోసాగా 'ఫసల్ బీమా యోజన'
రూ. 2.06 లక్షల కోట్లకు పైగా పరిహారం చెల్లింపు
న్యూఢిల్లీ: ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు మరియు తెగుళ్ల వల్ల సంభవించే పంట నష్టాల నుండి రైతులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన' (PMFBY) దేశీయ వ్యవసాయ రంగానికి బలమైన రక్షణ వలయంగా మారింది. ఫిబ్రవరి 2016లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 92.46 కోట్లకు పైగా రైతు దరఖాస్తులకు బీమా కల్పించగా, 26.33 కోట్లకు పైగా దరఖాస్తుదారులకు ₹2.06 లక్షల కోట్లకు పైగా క్లెయిమ్ల పరిహారం లభించింది.
రైతులు ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య మరియు ఉద్యానవన పంటలకు 5% మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. మిగిలిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో భరిస్తాయి. (ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో సబ్సిడీ ఉంటుంది). పారదర్శకమైన అంచనాల కోసం 'నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్', 'డిజిక్లెయిమ్', 'YES-TECH', మరియు వాతావరణ సమాచారం కోసం 'WINDS' లాంటి అధునాతన డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నారు.
రుణగ్రహీతలతో పాటు రుణాలు లేని రైతులకు కూడా ఈ పథకం అందుబాటులో ఉంది. నమోదు చేసుకున్న మొత్తం రైతులలో దాదాపు 50% మంది స్వచ్ఛందంగా చేరిన రుారహిత రైతులే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ (ఖరీఫ్ 2022), జార్ఖండ్ (ఖరీఫ్ 2024), పశ్చిమ బెంగాల్ (ఖరీఫ్ 2026) తిరిగి చేరగా, బీహార్ (రబీ 2026-27) నుండి అమలు చేయనుంది. ప్రస్తుతం 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతోంది.
2026-27 కేంద్ర బడ్జెట్లో ఈ పథకానికి ₹12,200 కోట్లు కేటాయించారు. ఆగస్టు 27, 2026 నాటికి ఖరీఫ్ 2026 సీజన్ కింద 241.38 లక్షల మంది రైతులు (278.12 లక్షల హెక్టార్లు) నమోదు చేసుకున్నారు. అస్సాంలోని నాగావ్ జిల్లాకు చెందిన అన్వర్ హుస్సేన్ అనే చిన్న రైతు కేవలం ₹100 ప్రీమియం చెల్లించి, పంట దెబ్బతిన్నప్పుడు ₹50,600 పరిహారం పొందడం ఈ పథకం సాధించిన క్షేత్రస్థాయి విజయానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.