ఏజెన్సీ కోర్టులకు ఆ అధికారం లేదు *గిరిజనేతరుల ఆస్తుల వివాదాలపై సుప్రీమ్ కోర్టు స్పష్టికరణ * సివిల్ కోర్టులే పరిష్కరించాలని తీర్పు
(సూర్య లీగల్ కరస్పాండెంట్): నెల మొదటి వారంలో సుప్రీంకోర్టు షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరుల ఆస్తులకు సంబంధించి ఒక ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఇద్దరు గిరిజనేతరుల మధ్య ఆస్తి వివాదంలో ఏ కోర్టుకి అధికారం ఉందనే విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత నిచ్చింది .అలాంటి సందర్భాల్లో ఏజెన్సీ కోర్టులకు అధికారం లేదని,సివిల్ కోర్టులకే పూర్తి అధికారం ఉందని పేర్కొంది.
వివరాల్లోకి వెళితే ఏజెన్సీలో నివసించే గిరిజనేతరుడైన ముక్కెర ముత్తయ్య వారసులు ఆస్తి వివాదంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుని ఆశ్రయించడం జరిగింది.ఆస్తి ఎవరికి చెందుతుందనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సివిల్ కోర్టులకు విచారించే అధికారం ఉందని తీర్పు ఇవ్వటం జరిగింది.మొదటి అప్పిలేట్ కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్ధించింది. అయితే ఆ రెండు కోర్టుల నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టింది. విచారించే అధికారం ఏజెన్సీ కోర్టులకె ఉందని 2022 లో ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో సివిల్ కోర్టుల లో ఉన్నటువంటి మొత్తం కేసులన్నిటిని ఏజెన్సీ కోర్టులకు బదలాయించడం జరిగింది.
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పై నిర్ణయానికి రావడానికి సుప్రీంకోర్టు గతంలో నాగార్జున గ్రామీణ బ్యాంక్ మరియు మేడి నారాయణ మధ్యలో నడిచిన కేసులో ఇచ్చినటువంటి తీర్పు ముఖ్య కారణం. మరి ఈ తీర్పునకు రాష్ట్ర ఉన్నత అధికార కమిటీ నిర్ణయమే ప్రధాన కారణం. 1972 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సివిల్ కోర్టుల చట్టాన్ని తేవడం జరిగింది. వివిధ కోర్టులను ఏర్పాటు చేస్తూ వాటి అధికార ఆర్థిక, పరిధిని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే ఈ చట్టం లోనే అది షెడ్యూల్ ఏరియాలకు వర్తించదని విస్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకున్న సుప్రీం కోర్టు ఆ చట్టం ఏజెన్సీ ఏరియాలకు వర్తింప చేయకపోతే కలిగే కష్ట నష్టాలను ప్రస్తావించడం జరిగింది. కనుక ఈ చట్టాన్ని షెడ్యూల్ ఏరియాలో కూడా అమలుపరచడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని లేదా చట్టాన్ని అయినా సవరణ చేయాలని అభిప్రాయపడింది. ఆ విషయాన్ని అప్పటి ప్రభుత్వ న్యాయవాది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికార కమిటీలో వివిధ ఉన్నతాధికారులు, మంత్రులు మరియు స్వచ్ఛంద ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. కమిటీ కూలంకుషంగా చర్చించిన పిదప 1972 సివిల్ కోర్టుల చట్టం ఏజెన్సీ ఏరియాలకు గుర్తించదని నిర్ణయించింది. ఫలితంగా పైన పేర్కొన్న తీర్పు వచ్చింది.
అయితే ఈ సుప్రీం కోర్ట్ తీర్పు న్యాయ సూత్రాల కనుగుణంగా జరిగిందా లేదా అనేది ప్రస్తుత సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టత నిచ్చింది. 1972 చట్టం ఎందుకు వర్తించదొ అనే విషయం న్యాయ సూత్రాల ఆధారంగా నిర్ణయం జరగలేదు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికార కమిటీ నిర్ణయాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకొని నిర్ణయించడం జరిగింది. కనుక ఇది రేషియో డిసీడెంటి కాదు. 1972 చట్టం ఎందుకు ఏజెన్సీ ఏరియాలకు వర్తిస్తుందో ప్రస్తుత తీర్పులో సుప్రీం కోర్ట్ పూర్తి స్పష్టతనిచ్చింది.
1874 సంవత్సరంలో షెడ్యూల్ డిస్ట్రిక్ట్ యాక్ట్ తేవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం షెడ్యూల్ ఏరియాలోని గిరిజనుల సంప్రదాయాలను, హక్కులను, వారి ఆచారాలను ఆస్తులను కాపాడడం. ఈ చట్టానికి లోబడి 1924 లో ప్రభుత్వం ఏజెన్సీ రూల్స్ అమల్లోకి తెచ్చారు. ఈ రూల్స్ ప్రధాన ఉద్దేశం షెడ్యూల్ ఏరియాలోని గిరిజనుల మధ్య వివాదాలను పరిష్కరించడం.
విచిత్రం ఏమిటంటే 1972 చట్టంలో విష్పష్టంగా ఏజెన్సీ ప్రాంతాలకు ఈ చట్టం వర్తించదని పేర్కొన్నప్పటికీ, సుప్రీంకోర్టు నాగార్జున గ్రామీణ బ్యాంక్ కేసులో అదే విషయాన్ని స్పష్టపరిచినప్పటికీ సివిల్ కోర్టులు ఏజెన్సీలోని గిరిజనేతర ఆస్తులు విషయంలో విచారిస్తూనే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం కోర్టుల దృష్టికి ఎవరు తీసుకపోకపోవడo. 2022 లో ప్రస్తుత కేసులో హైకోర్టు తీర్పు వచ్చేటప్పటివరకు విచారిస్తూనే ఉన్నాయి. ఈ కేసులో హైకోర్టు తీర్పుతో గిరిజనేతరుల మొత్తం కేసులు కూడా ఏజెన్సీ కోర్టులకు బదలాయించడంతో వారి కష్టాలు మొదలయ్యాయి.
అప్పటినుండి గిరిజనేతరుల కేసులు పరిష్కారానికి నోచుకోక వేలాదిగా ఏజెన్సీ కోర్టుల లో మూలుగుతున్నాయి. ఏజెన్సీ కోర్టులకు కలెక్టర్ మరియు ఇతర రెవెన్యూ అధికారులు జడ్జిలుగా ఉండి పరిష్కరిస్తున్నారు. రెవిన్యూ అధికారులు తమ తమ అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో అది కాక వారానికి ఒకసారి మాత్రమే కోర్టు నిర్వహించడంతో కేసులు పరిష్కారానికి నోచుకోక గుట్టలు గుట్టలుగా పేరుకు పోయాయి. అంతేగాక వారికి సివిల్ చట్టాలలో అంత అనుభవం లేకపోవడంతో కేసులు అంత త్వరగా తెమలవు.ఇప్పుడు ఈ తీర్పుతో న్యాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమ కష్టాలకు చెల్లు చీటీ పడుతుందని.
ఇద్దరు గిరిజనేతరులు తమ ఆస్తి విషయంలో సివిల్ కోర్టుకు అధికారం లేదని తీర్పునివ్వడం పూర్తిగా చట్ట విరుద్ధం. గిరిజన చట్టాల ముఖ్య ఉద్దేశం వారి వారి హక్కులను భూములను, సాంప్రదాయాలను కాపాడడం. కానీ గిరిజనేతరుల భూ వివాదాల్లో సివిల్ కోర్టులు జోక్యం చేసుకోవద్దు అనడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం మరియు సమన్యాయానికి వ్యతిరేకం అని సుప్రీంకోర్టు విష్పష్టంగా పేర్కొంది. ఈ రూల్స్ గిరిజనేతరుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించినవి కావు. గిరినేతరుల మధ్య వివాదాలు పరిష్కరించడానికి తేలేదు.కానీ ఒకవేళ ఉభయులలో ఒకరు ట్రైబల్ అయితే ఏజెన్సీ కోర్టులకు విచారించే అధికారం ఉంటుంది. కానీ ఏరియా అని ఉన్నంత మాత్రాన ప్రతి విషయంలో ఏజెన్సీ కోర్టులకు విచారణ అర్హత ఉండదు.
ఈ సందర్భంగా సుప్రీం కోర్ట్ ఏజెన్సీ ఏరియాలోని గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఏర్పడిన చట్టాలను కూలం కుశంగా చర్చించడం జరిగింది. వారి హక్కులను పరిరక్షించే విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసింది.
ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఈ తీర్పు రావడంతో గిరిజన ప్రాంతాల్లోని గిరిజనేతరులు తమ ఆస్తులు విషయంలో తొందరగా న్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు పెండింగ్ లో ఉన్న కేసులకి మరియు భవిష్యత్తు కేసులకి మాత్రమే వర్తిస్తుంది.