ఔషధ భద్రతపై గుజరాత్ ఎఫ్డిసిఎ ఉక్కుపాదం
50 సంస్థల లైసెన్సులు రద్దు, 42 టన్నుల నాసిరకం ఆహార ఉత్పత్తులు స్వాధీనం
గాంధీనగర్: నకిలీ, నాసిరకం ఔషధాలు మరియు ప్రమాదకర ఆహార ఉత్పత్తుల విక్రయాలపై గుజరాత్ ఆహార మరియు ఔషధ నియంత్రణ పరిపాలన (FDCA) భారీ దాడులు నిర్వహించి తీవ్ర చర్యలు చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించిన 50 ఔషధ సంస్థల అమ్మకాల లైసెన్సులను ఎఫ్డిసిఎ రద్దు చేయగా, రెండు తయారీ యూనిట్లను తక్షణమే మూసివేయాలని ఆదేశించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
తీవ్రమైన లోపాలు కనుగొన్న ఎనిమిది తయారీ సంస్థల లైసెన్సులను నిలిపివేసి, 11 తయారీ లైసెన్సులను పూర్తిగా రద్దు చేశారు. క్వాలిటీ టెస్టుల్లో విఫలమైన 20 ఔషధాల తయారీదారులకు షో-కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 42 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టి మూడింటిని మూసివేశారు.
వడోదరలో ట్రామడాల్ వంటి మత్తు ఇంజెక్షన్ల నిల్వను స్వాధీనం చేసుకుని ఎన్డిపిఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేశారు. అలాగే లక్నో నుండి అహ్మదాబాద్ వరకు వ్యాపించిన నకిలీ 'నికార్డియా రిటార్డ్ 10' మాత్రల సరఫరా గొలుసును ఛేదించి క్రైమ్ బ్రాంచ్కు ఫిర్యాదు చేశారు.
ఆగస్టు నెలలో రూ. 93.47 లక్షల విలువైన 42,988 కేజీలకు పైగా అనుమానాస్పద ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పటాన్లో 14,709 కిలోల వంట నూనె, కామ్రేజ్లో 5,157 కిలోల నకిలీ నెయ్యి, జామ్నగర్లో 7,138 కిలోల పాలు, డీసాలో 6,071 కిలోల కారం పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,625కు పైగా రెస్టారెంట్లు, ధాబాలలో పరిశుభ్రతను తనిఖీ చేయగా, తీవ్ర లోపాలున్న 38 సంస్థల లైసెన్సులను రద్దు చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ ఆహార, ఔషధ విక్రయదారుల పట్ల ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పాటిస్తుందని, నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు కొనసాగుతాయని మంత్రి ప్రఫుల్ పన్షేరియా హెచ్చరించారు.