286 రోజుల రికార్డు సముద్ర ప్రయాణం తర్వాత థాయ్లాండ్లో అమెరికా యుద్ధ నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' లంగరు
లేమ్ చాబాంగ్ (థాయ్లాండ్): మధ్యప్రాచ్యంలో సుదీర్ఘ కాలం పాటు మోహరించిన అమెరికా నావికాదళానికి చెందిన అణుశక్తి ఆధారిత విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' (USS Abraham Lincoln) బుధవారం థాయ్లాండ్లోని లేమ్ చాబాంగ్ ఓడరేవుకు చేరుకుంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో నావికా దిగ్బంధనం మరియు పోరాట విధుల్లో పాల్గొన్న ఈ యుద్ధ నౌక, ఏకధాటిగా 286 రోజుల పాటు సముద్రంలో గడిపి చారిత్రాత్మక రికార్డును నమోదు చేసింది.
సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లతో ఉన్న ఈ నౌక సుదీర్ఘ మోహరింపు తర్వాత సిబ్బందికి విశ్రాంతి, పునరుత్తేజం అందించేందుకు థాయ్లాండ్లో ఐదు రోజుల పాటు లంగరు వేసింది. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్-3 కమాండర్ రాబర్ట్ ఇ. లౌగ్రాన్ మాట్లాడుతూ, తమ బృందం అత్యంత వృత్తి నైపుణ్యంతో చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని తెలిపారు.
అత్యాధునిక ఎఫ్-35 (F-35) ఫైటర్ జెట్లతో వచ్చిన ఈ నౌకలోని సైనికుల వినోదం కోసం సమీపంలోని పర్యాటక ప్రాంతమైన పట్టాయాకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అయితే, ప్రమాదకరమైన వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీయింగ్, బాక్సింగ్ వంటి కార్యకలాపాలను సైనికులకు నిషేధించారు.
అమెరికా సైనికుల రాకతో పట్టాయా నగరంలోని స్థానిక వ్యాపారాలు, హోటళ్లు, రాత్రివేళ వినోద కేంద్రాలకు వ్యాపారపరంగా పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని స్థానిక వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఆరు నుండి తొమ్మిది నెలల మధ్య ఉండే నావికాదళ మోహరింపును యుద్ద పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది నవంబర్ నుండి అమెరికా రక్షణ శాఖ పొడిగించింది.