నేటి నుంచి మథురలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగస్వామ్యం
మథుర: రెండు రోజుల శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం మథుర చేరుకోనున్నారు. మథుర పరి పరిసర ప్రాంతాలైన బ్రజ్ భూమికి జన్మాష్టమితో అత్యంత పవిత్రమైన అనుబంధం ఉన్న నేపథ్యంలో యోగి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
గురువారం మధ్యాహ్నం మథురకు చేరుకోనున్న సీఎం యోగి, 'ఉత్తరప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్' సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అనంతరం గీతా శోధ సంస్థాన్ వద్ద సుమారు రూ. 42 కోట్ల వ్యయంతో నిర్మించిన 'శ్రీ హరిదాస్ ఆడిటోరియం'తో సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కాగా, ఈ ఆడిటోరియం ప్రాజెక్టును మథుర ఎంపీ హేమా మాలిని ఇదివరకే ప్రారంభించారు.
గీతా శోధ సంస్థాన్ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం, బృందావన్లోని ప్రసిద్ధ శ్రీ బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి సీఎం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం శ్రీ కృష్ణ జన్మస్థాన్ వద్ద 'గో పూజ' నిర్వహించి ఆలయంలో పూజలు చేయనున్నారు. ఆ తర్వాత అక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మథురతో పాటు ఆయన బాల్యం గడిపిన బృందావన్, గోకుల్ ప్రాంతాలు పండుగ శోభతో విలసిల్లుతున్నాయి. అర్ధరాత్రి వేళ ప్రత్యేక పూజలు, భజనలతో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనుండటంతో దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.