విశాఖపట్నం వేదికగా 41వ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు:పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
*రాష్ట్ర పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్ట్రేషన్ రుసుముల్లో బంపర్ రాయితీలు*
*ఏపీ భాగస్వాములకు రూ. 10,000 ఐఏటీఓ ప్రవేశ రుసుము పూర్తి మినహాయింపు*
*సదస్సు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 8,500 నుండి రూ. 3,000 లకు తగ్గింపు*
*రాష్ట్ర పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పిలుపు*
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, స్థానిక పర్యాటక భాగస్వాములకు జాతీయ స్థాయిలో విస్తృత అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఈ నెల 10 నుండి 12 వరకు జరగనున్న 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ వార్షిక సదస్సు విశేషాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక ప్రతినిధులు, టూర్ ఆపరేటర్లు, హోటల్ నిర్వాహకులు, విధాన నిర్ణేతలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర పర్యాటక రంగానికి దక్కిన గొప్ప అవకాశమని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2,068 కి పైగా సభ్యులతో ఇన్-బౌండ్ టూరిజంలో అగ్రగామిగా ఉన్న ఐఏటీఓ, ఏపీ పర్యాటక భాగస్వాముల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించిందని , రాష్ట్రానికి చెందిన టూర్ ఆపరేటర్లు, హోటళ్ళు, పర్యాటక భాగస్వాములు ఐఏటీఓ సభ్యత్వం పొందేందుకు చెల్లించాల్సిన రూ. 10,000 (+ జిఎస్టీ) వన్-టైమ్ అడ్మిషన్ ఫీజును పూర్తిగా రద్దు చేయడం జరిగిందన్నారు. ఈ రాయితీ 2026 డిసెంబర్ 31 వరకు అందజేసే దరఖాస్తులకు వర్తిస్తుందని ,సాధారణంగా ఐఏటీఓ సభ్యులకు రూ. 6,000, సభ్యులు కానివారికి రూ. 8,500 ఉండే సదస్సు రిజిస్ట్రేషన్ ఫీజును ఏపీ ప్రతినిధులకు కేవలం రూ. 3,000 కే నిర్ణయించామన్నారు.అర్హులైన స్థానిక పర్యాటక ప్రతినిధులు ఎటువంటి ప్రాథమిక ప్రవేశ రుసుము చెల్లించకుండా ఐఏటీఓ అధికారిక పోర్టల్ https://iato.in/Register/form ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని , ఈ సదస్సుకు దేశ నలుమూలల నుండి 1,000 మందికి పైగా ప్రముఖ ఇన్-బౌండ్ టూర్ ఆపరేటర్లు, డొమెస్టిక్ ట్రావెల్ కంపెనీలు, డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీలు, హోటల్ రంగ ప్రతినిధులు, విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారని దీనివల్ల ఏపీలోని హోటళ్ళు, రిసార్టులు, పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో ఉచితంగా ప్రచారం చేసుకోవడంతో పాటు, దేశంలోని అగ్రగామి టూర్ ఆపరేటర్లతో నేరుగా వ్యాపార సంబంధాలు నెలకొల్పుకునే అవకాశం లభిస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. రాష్ట్రంలోని హోటళ్ళు, రిసార్టుల యాజమాన్యాలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, హోమ్స్టే నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, టూరిస్ట్ గైడ్లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ ఈ అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఐఏటీఓ సభ్యత్వం పొందడంతో పాటు సదస్సులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర సహకారంతో ఏపీని దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.