వజ్రాల నుంచి రక్షణ రంగానికి భారత్-బెల్జియం బంధం
5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్య రెట్టింపునకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: భారత్-బెల్జియం దౌత్య సంబంధాలు సాంప్రదాయ వజ్రాల వ్యాపారాన్ని దాటి రక్షణ, స్వచ్ఛ ఇంధనం, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్ల వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రకటింఛారు. బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్తో న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ఇరు దేశాల భాగస్వామ్యం గణనీయమైన పురోగతిని సాధించి, కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
'జోరావార్' ట్యాంక్ ఉత్పత్తులు, ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ, రక్షణ సహ-అభివృద్ధి మరియు ఉమ్మడి తయారీ (Co-production) రంగానికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. అలాగే అంతర్జాతీయ నేరాల అడ్డుకట్టకు నిఘా సమాచారాన్ని పంచుకోనున్నాయి. పునరుత్పాదక ఇంధనంపై కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక ప్రధాన గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టును భారత్, బెల్జియం సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి.
బెల్జియానికి చెందిన ప్రముఖ 'IMEC' సంస్థను భారత సెమీకండక్టర్ ఎకోసిస్టమ్తో అనుసంధానించనున్నారు. దీంతో పాటు కీలక ఖనిజాల శుద్ధి, రీసైక్లింగ్లలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బెల్జియం కంపెనీల కోసం భారతదేశం ప్రత్యేకంగా 'ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్-ట్రాక్' వ్యవస్థను ఏర్పాటు చేసింది.
రెండు దేశాల మధ్య మేధావుల, ప్రతిభావంతుల రాకపోకలను సులభతరం చేసేందుకు త్వరలోనే 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్' ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధ సంక్షోభాలకు త్వరితగతిన శాంతియుత పరిష్కారం దొరకాలని, ఉగ్రవాద నిర్మూలనకు కలసికట్టుగా పోరాడాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి.
మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బెల్జియం నేలలో భారతీయ సైనికులు చేసిన త్యాగాలను స్మరించుకున్న ప్రధాని మోదీ, బలమైన ప్రజాస్వామ్య విలువలు భారత్, బెల్జియంలను సహజ భాగస్వాములుగా నిలబెట్టాయని వ్యాఖ్యానించారు.