భారత్-సెయిషెల్స్ బంధం మరింత బలోపేతం
ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో సెయిషెల్స్ పార్లమెంటరీ బృందం భేటీ
న్యూఢిల్లీ: భారత్, సెయిషెల్స్ దేశాల మధ్య ఉన్న చిరకాల ద్వైపాక్షిక, పార్లమెంటరీ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గురువారం పార్లమెంట్ భవనంలో సెయిషెల్స్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నెస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు.
సెయిషెల్స్ జాతీయ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా ఎన్నికైన ఎర్నెస్టాకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలపడంతో పాటు, ఆ దేశ స్వాతంత్ర్య 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందించారు. 2026 సంవత్సరం భారత్-సెయిషెల్స్ దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవ సంవత్సరమని, ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి పర్యటనలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
సెయిషెల్స్ అభివృద్ధి, భద్రతా అవసరాల కోసం ఫిబ్రవరిలో భారత్ ప్రకటించిన 175 మిలియన్ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. భారత పార్లమెంట్లో అమలు చేస్తున్న కాగితరహిత (పేపర్లెస్) కార్యకలాపాలు, డిజిటల్ ఆర్కైవ్స్, ఏకకాల అనువాదం, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక విధానాలను అధ్యయన పర్యటనలు, శిక్షణా కార్యక్రమాల ద్వారా సెయిషెల్స్ అసెంబ్లీతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.
సెయిషెల్స్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తమిళ, గుజరాతీ వర్గాలు ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. స్పీకర్ ఎర్నెస్టా క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం భారత్-సెయిషెల్స్ ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పార్లమెంటరీ బృందం పర్యటన ఇరు దేశాల ప్రాతినిధ్య సంస్థల మధ్య సహకారానికి సరికొత్త ఊపునిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు.