భారత ఎఫ్టీఏల వినియోగంపై దేశవ్యాప్త ప్రచారం
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ప్రయోజనాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేందుకు దేశవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన “FTAల సద్వినియోగం: ఒక విస్తృత ప్రచార కార్యక్రమం” జాతీయ వర్క్షాప్లో ఆయన ప్రసంగిస్తూ, దేశంలోని ప్రతి జిల్లాలోని వ్యాపారులకు ప్రాధాన్యతా మార్కెట్ సౌకర్యం అందేలా రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలు మరియు ఎగుమతిదారులు కృషి చేయాలని కోరారు.
దేశంలోని 780 జిల్లాలలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలు మరియు తొలిసారి ఎగుమతి చేసేవారికి ఎఫ్టీఏల ద్వారా లభించే అవకాశాలపై స్థానిక భాషల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుత సంవత్సరానికి భారత్ 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యంతో (సుమారు 16% వృద్ధి) ముందుకు సాగుతోంది. ఏప్రిల్-జూలై మధ్యకాలంలో దేశ ఎగుమతులు 317 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అలాగే, 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల దీర్ఘకాలిక లక్ష్యాన్ని చేరుకోవడమే భారత ధ్యేయమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న 9 ఎఫ్టీఏ నెట్వర్క్లు దాదాపు 60 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు ప్రాప్యతను ఇస్తున్నాయి. రాబోయే వాణిజ్య ఒప్పందాలతో భారతీయ ఎగుమతిదారులు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% వాటాను తక్కువ సుంకాలతో పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఈ-కామర్స్ మరియు డిజిటల్ వేదికల ద్వారా ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతిపాదిత 100 'భవ్య' పార్కులలో మరియు పారిశ్రామిక క్లస్టర్లలో ఎగుమతిదారులకు ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలు, రాయితీలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.
మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో ఇప్పటికే ఒప్పందాలు అమలులో ఉన్నాయని, ఆసియాన్, జపాన్, కొరియా ఒప్పందాల సమీక్షతో పాటు కెనడా, గల్ఫ్ దేశాలతో కొత్త మార్కెట్ ప్రాప్యతకు భారత్ నిరంతరం కృషి చేస్తోందని గోయల్ వివరించారు.