శాంతి ఒప్పందానికి అవకాశం ఉంది...కానీ కీవ్ వైఖరితోనే చిక్కులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
మాస్కో: ఉక్రెయిన్తో నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, అయితే ఉక్రెయిన్ చేపడుతున్న చర్యలే చర్చల పునరుద్ధరణను క్లిష్టతరం చేస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యా ఫార్ ఈస్ట్లో జరిగిన ఆర్థిక సదస్సులో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా గగనతలంలో పౌర విమానాలు ప్రయాణించవద్దని కీవ్ హెచ్చరికలు జారీ చేయడం, అలాగే వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులకు తెగబడటం శాంతి ప్రయత్నాలకు ఆటంకంగా మారాయని ఆయన మండిపడ్డారు.
శాంతి పరిష్కారానికి అమెరికా, చైనాలు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, అంతిమంగా రష్యా, ఉక్రెయిన్లే ఈ సమస్యను తేల్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
పౌర విమానాలు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ ఉక్రెయిన్ ప్రకటనలు చేయడం తీవ్రమైన అంశమని, ఇటువంటి చర్యలు చర్చల అవకాశాలను సంక్లిష్టం చేస్తాయని పుతిన్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వంతో రష్యా నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించడానికి రష్యా సిద్ధంగా ఉందని, ట్రంప్ కూడా నిర్మాణాత్మక సహకారానికి సుముఖంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఇరు దేశాల నిఘా సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయని, గూఢచారి విభాగాల అధిపతులతో మాట్లాడేందుకు సీఐఏ (CIA) అధిపతి జాన్ రాట్క్లిఫ్ ఇటీవల మాస్కో వచ్చారని పుతిన్ వెల్లడించారు. రష్యా సముద్ర, వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసిన తరుణంలో, శాంతి చర్చలపై పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.