అభివృద్ధి, సంక్షేమంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
అభివృద్ధి, సంక్షేమంతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
- ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశాం
- సోలార్ విద్యుత్తో సొంత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం
- పీఎం కుసుమ్తో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్
- కేంద్ర, రాష్ట్ర పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- కారంచేడులో నీటి శుద్ధి కేంద్రాల ప్రారంభంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
సూర్య ప్రతినిధి, ఒంగోలు :
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.బాపట్ల జిల్లా కారంచేడులో సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన మూడు సామాజిక నీటి శుద్ధి కేంద్రాలను శుక్రవారం మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. కేంద్రాల ఏర్పాటుకు సహకరించిన దాతలను అభినందించారు. ఇటువంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే అవి ప్రజలకు నాలుగు కాలాల పాటు ఉపయోగపడేలా నిర్వహించడం మరో ఎత్తని అన్నారు. కారంచేడులో మూడు, నాలుగు దశాబ్దాల తర్వాత నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.3.50 కోట్లతో కొత్త పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరో రూ.6 కోట్లతో పూర్తిస్థాయిలో కొత్త పైపులైన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ల పెంపు, ఉచిత బస్సు, గ్యాస్ తదితర పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. సామాజిక పెన్షన్ల కోసం ఏడాదికి రూ.33 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారందరికీ త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు.
విద్యుత్ రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. భవిష్యత్లో ఇతర వనరులపై ఆధారపడకుండా మన అవసరాలకు మనమే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో ఆరు లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్టాప్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రూ.2 లక్షలతో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.78 వేలకుపైగా సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. బీసీలకు కేంద్ర సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు అందిస్తుందని వివరించారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.అనంతరం పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి లబ్ధిదారులకు ఎల్ఓసీ పత్రాలను మంత్రి అందజేశారు. పర్చూరు మార్కెట్యార్డులో విద్యుత్శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోలార్, ఆర్డీఎస్ఎస్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై చర్చించారు. విద్యుత్శాఖ పనులను వేగవంతం చేయాలని, ఐదు వేల జనాభా కలిగిన గ్రామాలను గుర్తించి అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.కార్యక్రమాల్లో ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్తో పాటు పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.