"పల్లె నిద్ర"లో కలెక్టర్ పి. రాజాబాబు
సూర్య, ఒంగోలు రిపోర్టర్ : స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అందుకోసమే పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా జిల్లా యంత్రాంగం మొత్తం మీ మధ్యకు వస్తున్నది. ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకుంటాం. మీ సమస్యకు సత్వర పరిష్కారం చూపుతాము. ఆర్థికేతర సమస్యలపై అధికారులు తక్షణమే దృష్టి సారిస్తారు. ఆర్థికపరమైన సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం '... అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. గురువారం ఆయన గుడ్లూరు మండలం చిమిడిదెపాడు గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. స్థానికుల మంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజలతో ముఖాముఖి చర్చించి వారి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకే ' పల్లెనిద్ర ' కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెరుగైన జీవనోపాధి కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ' మనమిత్ర ' వాట్సప్ సేవలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ' కౌశలం ', విపత్తుల సమాచారాన్ని క్షణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే ' అవేర్ 2.0 ' ఆన్లైన్ పోర్టల్ గురించి స్వయంగా కలెక్టరే ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలోని గర్భిణులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లీబిడ్డ ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఏ.ఎన్.ఎం.ల ద్వారా లభిస్తున్న సేవలను వినియోగించుకోవాలని, పోషకాహారం తీసుకుంటూ సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, వైద్యుల ద్వారా పొందుతున్న సేవలపై గర్భిణులు సంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానికులు మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 488 కుటుంబాలు ఉన్నాయని, వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని చెప్పారు. గ్రామంలోని మురుగునీరు పంట కాలువలో కలుస్తుండడం వలన పంటలకు నష్టం కలుగుతోందని, కాలువలోకి దిగుతున్న వారికి చర్మ సంబంధ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. గ్రామానికి ప్రవేశ మార్గంలో కొత్త బ్రిడ్జి కావాలని, పొలాలకు రోడ్లు వేయాలని, గ్రామంలోపలికి బస్సు సౌకర్యం కల్పించాలని, స్మశానానికి స్థలం కేటాయించాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలను కలెక్టర్ ఓపికతో విన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ సందర్భంగా రూ.27.27 కోట్ల విలువైన బ్యాంకు చెక్కును అందించారు. ఈ రుణాలను మెరుగైన జీవనోపాధికి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం మొత్తం ప్రజల వద్దకు రావడం హర్షనీయమన్నారు. గ్రామస్తులు ప్రస్తావించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు. ముఖ్యంగా, రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డి. హిమవంశీ, జెడ్పీ సీ.ఈ.వో. చిరంజీవి, డిపిఓ అనుపమ, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాల జిల్లా అధికారి వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
దీనికి ముందుగా మండలంలోని అన్ని గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పల్లెనిద్ర కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కాగా, ఈ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.